మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో జట్టులోకి ఓ కొత్త క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని సన్రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది.
ఇంగ్లాండ్ రైటార్మ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్సే ఈ మధ్య గాయం బారిన పడ్డాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో కార్సే బొటనవేలికి గాయం తగిలింది. దీంతో అతడు టోర్నీలోని మిగతా మ్యాచ్ లకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే అతడి స్థానంలో రెహాన్ అహ్మద్ను తీసుకొచ్చి ఆడించింది ఇంగ్లాండ్.

సీజన్ నుంచి ఔట్..
అయితే ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభ సమయానికి కూడా కార్సే కోలుకునే పరిస్థితి కనపడకపోవడంతో, తమ జట్టులోకి కొత్త ఆటగాడిని ఆహ్వానించింది సన్రైజర్స్. 18వ సీజన్ మొత్తానికి కార్సే దూరమైనట్లు తెలిపిన సన్రైజర్స్.. అతడి స్థానంలో ఆల్ రౌండర్ వియాన్ ముల్దర్ను తీసుకున్నట్లు తెలిపింది. రూ.75 లక్షలకు అతడిని తీసుకున్నట్లు వెల్లడించింది.
బ్యాటింగ్లో తుస్సు.. బౌలింగ్లో కీలక వికెట్
వియాన్ ముల్దర్ పేస్ బౌలింగ్ ఆల్రౌండర్. రైట్ హ్యాండ్ బ్యాటర్ కూడా. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అతడు చివరగా న్యూజిలాండ్పై ఆడాడు. బ్యాటింగ్ లో నిరాశపరిచిన అతడు.. కేన్ విలియమ్సన్(102) కీలక వికెట్ మాత్రం తీశాడు.