IPL 2025: క్రికెట్ దక్షిణాఫ్రికా తన ఆటగాళ్లను మే 26లోగా ఐపీఎల్ 2025 నుంచి తిరిగి రావాలని కోరింది. వీరిలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కు ఎంపికైన 8 మంది ఆటగాళ్లు కూడా ఉన్నారు. జూన్ 11 నుంచి లార్డ్స్లో ఫైనల్ జరుగుతుంది. ఆటగాళ్లకు ఫైనల్కు సిద్ధం కావడానికి తగినంత సమయం లభించేలా బోర్డు ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది. దక్షిణాఫ్రికా నుంచి మొత్తం 20 మంది ఆటగాళ్లు ఐపీఎల్ 2025లో పాల్గొంటున్నారు.
బీసీసీఐతో చర్చలు
ఈ అంశపై క్రికెట్ దక్షిణాఫ్రికా, బీసీసీఐ మధ్య చర్చలు జరుగుతున్నాయి. దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ ఈ విషయంలో వెనక్కి తగ్గబోనని, మే 26 నాటికి తన ఆటగాళ్లను తిరిగి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కార్బిన్ బాష్(ముంబై ఇండియన్స్), వియాన్ ముల్డర్(సన్రైజర్స్ హైదరాబాద్), మార్కా జాన్సెన్(పంజాబ్ కింగ్స్), ఐడెన్ మార్క్రమ్(లక్నో సూపర్ జెయింట్స్), లుంగి ఎంగిడి(రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), కగిసో రబాడ(గుజరాత్ టైటాన్స్), ర్యాన్ రికెల్టన్(ముంబై ఇండియన్స్), ట్రిస్టన్ స్టబ్స్(ఢిల్లీ క్యాపిటల్స్) డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో ఉన్నారు.

దక్షిణాఫ్రికా ప్రాక్టీస్ మ్యాచ్
బీసీసీఐతో చర్చలు ఇంకా కొనసాగుతున్నాయనని సీఎస్ఏ క్రికెట్ డైరెక్టర్ ఎనోచ్ న్వే తెలిపారు. ఆటగాళ్లు మే 31న ఇంగ్లాండ్లోని అరండేల్లో సమావేశమవుతారు. ఆ తర్వాత జూన్ 3 నుంచి 6 వరకు జింబాబ్వేతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్కు వెళతారు. ఐపీఎల్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ముందుగా ఇది మే 25న ముగియాల్సి ఉంది. కానీ ఇప్పుడు లీగ్ దశ మే 27 వరకు కొనసాగుతుంది. ప్రేఆఫ్స్ మే 29 నుంచి ప్రారంభమవుతాయి.
బోర్డు తన మాట మీద నిలబడుతుంది..
దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ మాట్లాడుతూ.. ఐపీఎల్, బీసీసీఐతో ప్రాథమిక ఒప్పందం ప్రకారం ఫైనల్ 25న జరగాలని.. మా ఆటగాళ్లు 26న తిరిగి వస్తారని చెప్పుకొచ్చారు. తద్వారా వారికి 30న బయలుదేరే ముందు తగినంత సమయం లభిస్తుందన్నారు. మా వైపు నుంచి ఎటువంటి మార్పు రాలేదన్నారు. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయని.. ఈ చర్చలు క్రికెట్ డైరెక్టర్, ఫోలేట్సి మోసెక్ వంటి సీనియర్ అధికారులు నిర్వహిస్తున్నారు. కానీ ప్రస్తుతానికి మేము మా ప్రకటనకు కట్టుబడి ఉన్నామని.. మా ఆటగాళ్లు 26న తిరిగి రావాలని తాము కోరుకుంటున్నట్లు కోచ్ షుక్రి కాన్రాడ్ తెలిపారు.