IPL 2025: స్టార్ ఇండియన్ ఓపెనర్ శుభ్మన్ గిల్ శనివారం తన పేరు మీద ఒక ప్రత్యేక రికార్డును నమోదు చేశాడు. గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఐపీఎల్లో 2000 పరుగులు పూర్తి చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో గిల్ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్ కు ముందు ఈ రికార్డును సాధించడానికి శుభ్మన్ గిల్కు 53 పరుగులు అవసరం. లక్నోలో జరిగిన ఈ మ్యాచ్ లో 11వ ఓవర్ ఐదో బంతికి సింగిల్ తీయడం ద్వారా శుభ్మన్ గిల్ 2000 పరుగులు పూర్తి చేశాడు. ఐపీఎల్ 2024కు ముందు శుభ్మన్ గిల్ గుజరాత్ టైటాన్స్ జట్టు కెప్టెన్గా నియమితుడయ్యాడు. జట్టు కెప్టెన్ గా తన మొదటి సీజన్లో 12 మ్యాచ్ ల్లో మొత్తం 426 పరుగులు చేశాడు కానీ గుజరాత్ జట్టును ప్లే ఆఫ్స్ కు నడిపించడంలో విజయం సాధించలేకపోయాడు.
వరుసగా రెండు అర్థ సెంచరీలు
ఈ సీజన్ లో శుభ్మన్ గిల్ రెండో అర్థశతకం సాధించాడు. గిల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై కేవలం 38 బంతుల్లో 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో సన్రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన గుజరాత్ టైటాన్స్ నాలుగో లీగ్ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. గిల్ 43 బంతుల్లో 61 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.

శుభ్మన్ గిల్ 2018లో కోల్కతా నైట్ రైడర్స్ తరపున తన ఐపీఎల్ కెరీర్ను ప్రారంభించాడు. దీని తర్వాత ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ అతడిని రూ.8 కోట్లకు తమ జట్టులోకి చేర్చుకుంది. గుజరాత్ తరపున తన తొలి సీజన్ లో శుభ్మన్ గిల్ 16 మ్యాచ్ ల్లో 483 పరుగులు చేసి జట్టును ఛాంపియన్ గా చేయడంలో కీలక పాత్ర పోషించాడు. రెండో సీజన్ లో శుభ్మన్ గిల్ 3 సెంచరీలు, 4 అర్థ సెంచరీలు చేయడం ద్వారా అద్భుతంగా రాణించాడు. మొత్తం 890 పరుగులు సాధించడం ద్వారా ఆరెంజ్ క్యాప్ను గెలుచుకున్నాడు.
ఈ జాబితాలో రెండో స్థానంలో సాయి సుదర్శన్
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు పంజాబ్ లో జన్మించిన శుభ్మన్ గిల్ ను గుజరాత్ టైటాన్స్ రూ.16.50 కోట్లకు నిలుపుకుంది. శుభ్మన్ గిల్ తర్వాత గుజరాత్ టైటాన్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో సాయిసుదర్శన్ ఉన్నాడు. ఈ తమిళనాడు బ్యాటర్ ఇప్పుటివరకు గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున 31 మ్యాచ్ లు ఆడి 1300 కంటే ఎక్కువ పరుగులు చేశాడు.