MI vs PBKS Qualifier 2: శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో పంజాబ్ కింగ్స్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్కు చేరుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్స్ ఇన్నింగ్స్ ఆడడంతో పంజాబ్ కింగ్స్ ముంబై జట్టును చిత్తు చేసింది. పంజాబ్ 19 ఓవర్లలోనే లక్ష్యాన్ని సాధించింది. 2014 తర్వాత ఆ జట్టు తొలిసారి ఫైనల్కు చేరుకుంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా కూడా చరిత్ర సృష్టించాడు. క్వాలిఫయర్-2లో 87 పరుగులు చేసి మ్యాచ్ విన్నంగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్లో శ్రేయస్ 41 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. ఈ అద్భుతమైన ఇన్నింగ్స్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ చరిత్రలో తన కెప్టెన్సీలో 3 జట్లను ఫైనల్స్కు నడిపించిన తొలి కెప్టెన్గా నిలిచాడు.
శ్రేయస్ అయ్యర్కు రూ.24 లక్షల జరిమానా
అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఐపీఎల్ 2025 క్వాలిఫయర్-2లో పంజాబ్ కింగ్స్, ముంబై ఇండియన్స్ రెండూ స్లో ఓవర్ రేట్ను కొనసాగించాయి. ఈ క్రమంలో ఇరు జట్ల కెప్టెన్లు, ఆటగాళ్లకు జరిమానా విధించబడింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్కు స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు రూ.24 లక్షల జరిమానా విధించబడింది. ఈ నియమాన్ని పంజాబ్ కింగ్స్ జట్టు ఉల్లంఘించడం ఇది రెండోసారి. ఈ క్రమంలో బీసీసీఐ ఓ ప్రకటన విడుదల చేసింది.

"అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన ఐపీఎల్ 2025 రెండవ క్వాలిఫయర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్లో ఓవర్ రేట్ను కొనసాగించినందుకు జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం స్లో ఓవర్ రేట్ నేరాలకు సంబంధించి అతని జట్టు ఈ సీజన్లో ఇది రెండవ నేరం కావడంతో శ్రేయస్ అయ్యర్కు రూ. 24 లక్షల జరిమానా విధించబడింది. ఇంపాక్ట్ ప్లేయర్తో సహా మిగిలిన ప్లేయింగ్ ఎలెవన్ సభ్యులకు వ్యక్తిగతంగా రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25 శాతం, ఏది తక్కువైతే అది జరిమానా విధించబడింది" అని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది
హార్దిక్ పాండ్యాకు కూడా జరిమానా
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా స్లో ఓవర్ రేట్ కొనసాగించిన తర్వాత అతనికి కూడా జరిమానా విధించబడిందని బీసీసీఐ ప్రకటనలో పేర్కొంది. స్లో ఓవర్ రేట్ కారణంగా ముంబై ఇండియన్స్ జట్టుకు మూడోసారి శిక్ష విధించబడింది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాకు రూ.30 లక్షల జరిమానా విధించగా..మిగిలిన జట్టు సభ్యులు 12 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతం ఏది తక్కువైతే అది చెల్లించాల్సి ఉంటుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ దాదాపు 2 గంటల ఆలస్యంగా ప్రారంభమైనప్పటికీ ఓవర్లు తగ్గించబడలేదు. పంజాబ్ కింగ్స్ ఫైనల్లో ఆర్సీబీని ఎదుర్కోనుంది. ఈ టైటిల్ పోరు జూన్ 3న అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు.