IPL 2025: ఐపీఎల్ 2025 సిరీస్ను విమర్శిస్తూ.. దానిని రద్దు చేయాలని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ మిచెల్ జాన్సన్ పేర్కొన్నారు. పాకిస్థాన్ సూపర్ లీగ్ను కూడా నిలిపివేయాలని ఆయన అన్నారు. భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య యుద్ధం తర్వాత ఐపీఎల్ సీజన్ తిరిగి ప్రారంభం కానున్న తరుణంలో విదేశీ ఆటగాళ్లను సిరీస్లో ఆడమని బలవంతం చేస్తున్నారని, వారిపై ఒత్తిడి తెస్తున్నారని ఆయన విమర్శించారు.
భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్ మే 8న రద్దు చేయబడింది. దానికి కొన్ని రోజుల ముందు పాకిస్థాన్ సూపర్ లీగ్ కూడా నిలిపివేయబడింది. ఆ తర్వాత రెండు సిరీస్లు మే 17 నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రికెట్ సిరీస్ కాబట్టి యుద్ధ ఉద్రిక్తతల కారణంగా తమ దేశాలకు వెళ్లిన విదేశీ ఆటగాళ్లందరూ అదే వారంలోనే ఐపీఎల్ సిరీస్లో ఆడటానికి తిరిగి వచ్చారు. అయితే ఇంత అనిశ్చిత పరిస్థితిలో ఈ ఐపీఎల్ సిరీస్లో విదేశీ ఆటగాళ్లను ఆడించాలనే ఒత్తిడిని మిచెల్ జాన్సన్ విమర్శించారు.

భారత సరిహద్దులో ప్రస్తుతం యుద్ధం లాంటి పరిస్థితి లేనప్పటికీ మిచెల్ జాన్సన్ ఐపీఎల్ సిరీస్ను నిలిపివేయాలని పిలుపునిచ్చారు. దీని గురించి మిచెల్ జాన్సన్ మాట్లాడుతూ.. "మీరు నన్ను భారత్కు తిరిగి వెళ్లి ఐపీఎల్ ఆడమని అడిగి ఉంటే కచ్చితంగా వద్దు అని చెప్పేవాడిని. జీవితం, భద్రత చాలా ముఖ్యమైనవని.. జీతం కాదన్నారు. ఇది వ్యక్తిగత నిర్ణయమని చెప్పకొచ్చాడు. ఎవరినీ తిరిగి వెళ్లి ఆడమని బలవంతం , ఒత్తిడి చేయొద్దన్నాడు.
ఐపీఎల్, పీఎస్ఎల్ సిరీస్లను ఇప్పుడే ఆపాలి లేదా తదుపరి దశ వైపు వెళ్లాలని మిచెల్ జాన్సన్ సూచించారు. క్రికెట్ ఆస్ట్రేలియా తమ ఆటగాళ్లు సొంత నిర్ణయాలు తీసుకోవచ్చని తెలిపిందన్నాడు. కానీ ఆ నిర్ణయాలు చాలా కష్టంగా ఉంటాయన్నారు. ఆటగాళ్లు ఆడొద్దని నిర్ణయించుకుంటే అది నిరాశపరుస్తుందని.. వ్యాపారంలో ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందన్నాడు. కానీ భద్రత అనేది మొట్టమొదటి అంశంగా.. అన్నింటి కంటే ముఖ్యమైన అంశంగా ఉండాలన్నాడు.