కెరీర్ ప్రారంభంలో అద్భుతమైన ఆటతీరు కనబరిచిన పృథ్వీ షా.. భవిష్యత్ సూపర్ స్టార్గా ఎదుగుతాడని ప్రతీ క్రికెట్ అభిమాని భావించారు. కానీ, కొన్నాళ్ల తర్వాత అతడి ఆటతీరు పూర్తిగా పడిపోయింది. ఫిట్నెస్ కూడా కోల్పోయి బాగా లావైపోయాడు. రీసెంట్ గా ఐపీఎల్ మెగా వేలంలో అతడిని తీసుకునేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపించలేదు.
అయితే తన పేలవ ప్రదర్శన తీరు, క్రమశిక్షణారాహిత్యంతో విమర్శలు మూటగట్టుకుంటోన్న పృథ్వీ షాకు ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడే అన్క్యాప్డ్ ఇండియన్ బ్యాటర్ శశాంక్ సింగ్ మద్దతుగా నిలిచాడు. పృథ్వీ షా తన ఆటలోని కొన్నింటినీ చక్కగా ట్యూన్ చేసుకుంటే, మళ్లీ బలమైన పునరాగమనం చేయగలుగుతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. అలానే అతడు చేసిన కొన్ని స్వీయతప్పిదాలను ఎత్తి చూపాడు.

10 గంటలకు పడుకో..
"పృథ్వీ షాను తక్కువ అంచనా వేస్తున్నారు. అతడు మళ్లీ తన కెరీర్ ప్రారంభంలో ఉన్నట్లు (క్రమశిక్షణ) ఉంటే.. ఏదైనా సాధించగలడు. నాకు అతడు 13 ఏళ్లుగా తెలుసు. ఎందుకంటే నేను బొంబాయిలో అతడితో క్లబ్ క్రికెట్ ఆడాను. అతడిలో తప్పులు ఏమున్నాయి అని మీరు నన్ను అడిగితే, అతడి కొన్ని విషయాలను (ఉండే విధానాన్ని) మార్చుకోవాలని చెబుతాను. అతడు తన ఆట పట్ల కొన్ని విషయాలను పాటించాలి. రాత్రి 11 గంటలకు కాకుండా 10 గంటలకు నిద్రపోవాలి. డైట్ ను మార్చుకోవాలి. మరింత మెరుగుపరుచుకోవాలి. అతడు తన తప్పిదాలను అంగీకరించి వాటిని మార్చుకుంటే, ఇండియన్ క్రికెట్ కు అది మంచి విషయం అవుతుంది." అని శశాంక్ సింగ్ అన్నాడు.
10 మంది ఉన్నారు..
పృథ్వీ షా, సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉత్తమమైన వ్యక్తులు ఉన్నారని అన్నాడు శశాంక్. "నాకు తెలిసి ఇప్పటికే అతడు మార్పులు చేసుకుంటాడు. నా నుంచి అతడికి సలహాలు అవసరం లేదని అనుకుంటున్నాను. ఇప్పటికే అతడి చుట్టూ దాదాపు సలహాలు ఇచ్చే పది మంది ఉత్తమమైన వ్యక్తులు ఉన్నారు" అని శశాంక్ చెప్పుకొచ్చాడు. కాగా, గతేడాది వరకు దిల్లీ జట్టుకు ఆడిన పృథ్వీ.. ఈ మధ్య కాలంలో మెరుగైన ప్రదర్శన చేయడంలో దారుణంగా విఫలమయ్యాడు. దీంతో కనీస ధర రూ.75 లక్షలకు కూడా తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపలేదు.