IPL 2025 Sanju Samson: ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచుల్లో ఏకంగా 5 మ్యాచుల్లో ఓడింది. కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే గెలిచింది. దీంతో -0.174 నెట్ రన్ రేటుతో పాయింట్ల పట్టికలో కింద నుంచి మూడో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడీ జట్టుకు ఓ భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాజస్థాన్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ఇంతకీ అదేంటంటే?
రాజస్థాన్ రాయల్స్ ఆడిన గత మ్యాచులో (దిల్లీ క్యాపిటల్స్ పై) సంజు శాంసన్ మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. ఎందుకంటే మ్యాచులో సంజు శాంసన్ కు రిబ్ కేజ్లో నొప్పి వచ్చింది. దీంతో 19 బంతుల్లో 31 పరుగులు చేసిన అతడు రిటైర్డ్ హర్ట్ గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత మ్యాచ్ సూపర్ ఓవర్ కు దారీ తీయడం, అందులో దిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించడం జరిగిపోయింది.

అయితే ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్.. తన తర్వాతి మ్యాచును లక్నో సూపర్ జెయింట్స్ తో ఆడనుంది. ఈ మ్యాచుకు సంజు శాంసన్ ఆడటం అనుమానంగా మారింది. "సంజుకు అబ్డోమినల్ లో కాస్త నొప్పిగా ఉంది. అతడికి స్కాన్స్ తీయించాము. వాటి ఫలితాల గురించి ఎదురుచూస్తున్నాం. ఫలితం వచ్చాక గాయం తీవ్రతపై మరింత స్పష్టత వస్తుంది. తద్వారా మేము నిర్ణయం తీసుకుంటాం. చూద్దాం ఏం జరుగుతుందో." అని రాహుల్ ద్రవిడ్ ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్ లో మాట్లాడాడు.
కాగా, సంజు శాంసన్ ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు వేలి గాయం కారణంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో తొలి మూడు మ్యాచుల్లో కెప్టెన్ గా కాకుండా కేవలం బ్యాటర్ గానే బరిలోకి దిగాడు. ఆ సమయంలో రియాన్ పరాగ్ కెప్టెన్సీ బాధ్యతలను చూసుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా లక్నోతో మ్యాచుకు సారథ్యం వహించే అవకాశముంది.
రియాన్ పరాగ్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ తొలి రెండు మ్యాచుల్లో సన్ రైజర్స్, కేకేఆర్ పై ఓడింది. మూడో మ్యాచులో చెన్నై సూపర్ కింగ్స్ పై గెలిచింది. ఆ తర్వాత మళ్లీ పంజాబ్ కింగ్స్ పై విజయం సాధిచింది. కానీ ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచులో ఓటమిని అందుకుంది. పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.