ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిటెన్షన్ ప్లేయర్ల జాబితా ఆదివారం విడుదలైంది. ఆటగాళ్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ, ఆర్థిక వ్యూహాలతో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించింది. ఊహించినట్లుగానే కోల్కతా నైట్ రైడర్స్ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను, పంజాబ్ కింగ్స్ అత్యల్పంగా ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది. ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్లోనూ సీఎస్కేలో కొనసాగనున్నాడు.
ముంబై ఇండియన్స్ తమ కీలక ప్లేయర్లను ఫ్రాంచైజీలో కొనసాగించింది. పర్స్ వ్యాల్యూలో రూ.75 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను అట్టిపెట్టుకుంది. అయితే బుమ్రా, సూర్య, హార్దిక్ కంటే రోహిత్ తక్కువ ధరకు రిటైన్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ యాజమాన్యం బుమ్రాకు రూ.18 కోట్లు, సూర్య, హార్దిక్కు రూ.16.35 కోట్లు చొప్పున వెచ్చించారు.

మాజీ కెప్టెన్, అయిదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను రూ.16.30 కోట్లకు రిటైన్ చేసుకున్నారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు రూ. 8 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే సూర్య, హార్దిక్తో పోలిస్తే రూ.5 లక్షలు తక్కువ అయినప్పటికీ రోహిత్ స్టార్ డమ్కు ఆ మొత్తం తక్కువే. కాగా, తన రిటైన్ ధరపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన తనకి ఈ ధర సరైనదే అని అభిప్రాయపడ్డాడు. అంతర్జాతీయ క్రికెట్లో కొనసాగే బుమ్రా, హార్దిక్, సూర్యకే అత్యధిక ఉండటం సబబేనని అన్నాడు.
''రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఈ స్థానం నాకు సరైనదే అని భావిస్తున్నాను. జాతీయ జట్టుకు అత్యున్నత స్థాయిలో ప్రాతినిథ్యం వహిస్తున్న ఆటగాళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలని నేను నమ్ముతున్నాను. నా రిటెన్షన్పై నేను సంతోషంగా ఉన్నాను'' అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా, రోహిత్ శర్మతో పాటు టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లికి ఆర్సీబీ రూ.21 కోట్లు వెచ్చించింది. అలాగే రవీంద్ర జడేజాకు సీఎస్కే రూ.18 కోట్లు అందించింది.
కాగా, ముంబై ఇండియన్స్ పర్స్లో రూ. 45 కోట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ మొత్తంతో మెగా వేలంలో మిగిలిన ప్లేయర్లను సొంతం చేసుకోవాలి. అయిదుగురిని రిటైన్ చేసుకోవడంతో క్యాప్డ్ ప్లేయర్లకు వేలంలో ఆర్టీఎమ్ కార్డ్ను ఉపయోగించే అవకాశం కోల్పోయింది. ఈ క్రమంలో టాప్ విదేశీ ప్లేయర్లను వేలంలో ముంబై ఇండియన్స్ సొంతం చేసుకోవడం కష్టమే. వచ్చే సీజన్కూ హార్దిక్ పాండ్య ముంబై జట్టు సారథి బాధ్యతలు చేపట్టనున్నాడు.