Rohit Sharma: ఐపీఎల్ 2025 సిరీస్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అద్భుతంగా ఆడాడు. 50 బంతుల్లో 81 పరుగులు చేశాడు. రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్న తర్వాత మాట్లాడుతూ.. తనకు లభించిన అదృష్టాన్ని ఉపయోగించుకుని పరుగులు సాధించానని చెప్పాడు.
ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ జట్టు రోహిత్ శర్మ ఇచ్చిన రెండు క్యాచ్ అవకాశాలను చేజేతులా జారవిడుచుకుంది. ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుని రోహిత్ శర్మ అద్భుతంగా ఆడి హాఫ్ సెంచరీ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్ సిరీస్లో ఇది రోహిత్ శర్మకు నాలుగు హాఫ్ సెంచరీ. ఈ ఏడాది తాను కేవలం నాలుగు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశానని రోహిత్ శర్మ అసంతృప్తి వ్యక్తం చేశాడు.

దీని గురించి రోహిత్ శర్మ మాట్లాడుతూ.."నేను ఈ సంవత్సరం కేవలం నాలుగు అర్థ సెంచరీలు మాత్రమే సాధించాను. నేను ఇంకా చాలా స్కోర్ చేయగలనని నాకు అనిపించింది. ఎలిమినేటర్ మ్యాచ్ ఆడటం ప్రాముఖ్యతను బాగా అర్థం చేసుకున్నాను. నేను నా బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తూనే ఉన్నాను. ఈ రోజు అదృష్టం నా వైపు ఉంది. దాన్ని నేను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాను. నేను దానిని చేయగలిగినందుకు సంతోషంగా ఉంది. నా జట్టు మంచి స్థితిలో ఉంచడం మంచి అనుభూతి. ఇక్కడ కాస్త మంచు కురుస్తుంది కాబట్టి ఇది మాకు సవాలుగా ఉంటుందని మాకు తెలుసు. నేను కొట్టిన షాట్లన్నీ ఇంతకు ముందు చాలాసార్లు కొట్టిన షాట్లే. కానీ దురదృష్టవశాత్తు అవి పీల్డర్ల వద్దకు వెళ్లాయి. కానీ ఆ క్యాచ్లు మిస్ కావడం నా అదృష్టం" అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 228 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 81 పరుగులు, జానీ బెయిర్స్టో 22 బంతుల్లో 47 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 20 బంతుల్లో 33 పరుగులు, తిలక్ వర్మ 11 బంతుల్లో 25 పరుగులు, హార్దిక్ పాండ్యా 9 బంతుల్లో 22 పరుగులు చేశారు. తర్వాత లక్ష్య ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 208 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.