ఐపీఎల్ 2025 మెగా వేలానికి సంబంధించిన రిటెన్షన్ రూల్స్ను బీసీసీఐ ప్రకటించింది. ఆరుగురు ప్లేయర్లను ఓ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే వెసులుబాటు ఇచ్చింది. అయితే అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ కల్పించింది. రిటెన్షన్ పాలసీ ప్రకారం నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా దక్కించుకోవచ్చు.
అక్టోబర్ 31వ తేదీలోపు తమ రిటెన్షన్ లిస్ట్ను అన్ని ఫ్రాంచైజీలు సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత మెగా వేలం తేదీ, వేదిక వివరాలను బీసీసీఐ వెల్లడిస్తుంది. అయితే ఐపీఎల్ ఆక్షన్లో అత్యధిక పలికిన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ స్టార్క్కు ఈసారి ఆర్థికంగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. దానికి రోహిత్ శర్మ ఓ కారణం కానున్నాడని తెలుస్తోంది.

ఐపీఎల్-2024కు సంబంధించి జరిగిన మినీ వేలంలో స్టార్క్ను కోల్కతా నైట్ రైడర్స్ రూ.24. 75 కోట్లు రికార్డు మొత్తాన్ని వెచ్చించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కనీస ధర రూ.2 కోట్లతో వేలంలోకి వచ్చిన స్టార్క్ 12 రెట్లు అధికంగా డిమాండ్ పలికాడు. అయితే ఈసారి మాత్రం స్టార్క్ కనీసం రూ.20 కోట్లు కూడా దక్కేలా కనిపించట్లేదు.
నిబంధనల ప్రకారం రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, ఐదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు చెల్లించాలి. ఈ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. ఐపీఎల్-2024 విజేతగా కేకేఆర్ నిలవడంలో స్టార్క్ తన వంతు పాత్ర పోషించాడు. క్వాలిఫయిర్, ఫైనల్లో తన సత్తా ఏంటో నిరూపించాడు.
ఈ నేపథ్యంలో స్టార్క్ను రిటైన్ చేసుకోవాలని కేకేఆర్ ఫ్రాంచైజీ తొలుత భావించింది. కానీ ఐపీఎల్ తర్వాత జరిగిన టీ20 వరల్డ్ కప్లో స్టార్క్ బౌలింగ్లో రోహిత్ ఊచకోతకు దిగాడు. సిక్సర్లు, బౌండరీలతో హోరెత్తించి ఒకే ఓవర్లో రోహిత్ 29 పరుగులు పిండుకున్నాడు. టీ20ల్లో ఓ ఓవర్లో ఆస్ట్రేలియన్ ఇచ్చిన రెండో అత్యధిక పరుగులు ఇవే. రోహిత్ను స్ఫూర్తిగా తీసుకుని ఇటీవల స్టార్క్ బౌలింగ్లో ఇంగ్లండ్ బౌలర్ లివింగ్స్టోన్ కూడా చెలరేగిపోయాడు. ఓ ఓవర్లో 28 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో వన్డేల్లో ఓ ఓ ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన ఆస్ట్రేలియన్ బౌలర్గా స్టార్క్ కోరుకోని రికార్డు నమోదు చేసుకున్నాడు.
ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ కావడంతో స్టార్క్ అంతకుముందు ప్రధాన బ్యాటర్లకు తెలియన సమాధానంగా మిగిలిపోయేవాడు. కానీ రోహిత్ విధ్వసంతో అతని బౌలింగ్ను బ్యాటర్లు డీకోడ్ చేస్తున్నారు. దీంతో లిమిటెడ్ ఓవర్ల క్రికెట్లో స్టార్క్ పదును తగ్గిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేకేఆర్ కూడా స్టార్క్పై భారీ మొత్తం కాకుండా సాధారణ రీతిలోనే వెచ్చించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.