ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్పై ముంబయి ఇండియన్స్ ఓడిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఈ మ్యాచులో హార్దిక్ పాండ్యనే హీరో. అటు బంతితో (5/36) ఇటు బ్యాటుతో (28) అద్భుతంగా రాణించాడు. కానీ అతడి పోరాటం వృథా అయింది. ఆఖరి ఓవర్లో ముంబయి తడబడడంతో విజయం లక్నోకు వరించింది. అయితే ఈ మ్యాచుకు స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ గాయం కారణంగా అందుబాటులో లేదు. ఈ సీజన్ లో ఇప్పటివరకు అతడు పేలవ ప్రదర్శన చేసినప్పటికీ.. ఈ మ్యాచులో అతడు లేకపోవడం ముంబయి జట్టుకు పెద్ద లోటే అని క్రికెట్ అభిమానులు అంతా అనుకున్నారు. కానీ అతడు మ్యాచు బయట నుంచే చూస్తూ తాను అసలైన కెప్టెన్ అని నిరూపించకున్నాడు!
రోహిత్ సలహా...
హార్దిక్ కీలక సమయాల్లో వికెట్లు తీసి లక్నో ఎక్కువ స్కోరు చేయకుండా అడ్డుకట్ట వేశాడు. వైవిధ్యమైన బంతులతో అదరగొట్టి.. ఎల్ఎస్జీని దెబ్బ తీశాడు. అయితే హార్దిక్ కు బయట నుంచే రోహిత్ అడ్వైస్ ఇచ్చాడు. మోస్ట్ డేంజరస్ బ్యాటర్ పూరన్ (12) క్రీజుల్లోకి వచ్చిన సమయంలో అతడికి స్లో బాల్స్ వేయాలని సూచించాడు. దాన్ని పాటించినా హార్దిక్ కూడా నెమ్మదైన బంతులు వేసి పూరన్ ను పెవిలియన్ పంపాడు.

అయితే రోహిత్ ఇచ్చిన అడ్వైస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రోహిత్ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మరోసారి రోహిత్ శర్మ కెప్టెన్సీ వర్సెస్ హార్దిక్ పాండ్య కెప్టెన్సీని తెరపైకి తీసుకొచ్చి కామెంట్లు చేస్తున్నారు. పైగా హార్దిక్ కూడా.. ఈ మ్యాచ్ లో ఎక్కువ బంతులను మోస్తరు వేగంతోనే సంధించాడు. అందుకే అతడు ఐదు వికెట్లు తీయగలిగాడని, రోహిత్ సలహా పాటించడం వల్ల ఇది జరిగిందని ఫ్యాన్స్ అంటున్నారు. ముఖ్యంగా నికోలస్ పూరన్ ను ఔట్ చేయకపోయి ఉంటే, లక్నో కచ్చితంగా మరో 20-30 పరుగులు ఎక్కువ స్కోరు చేసేది అని కామెంట్లు చేస్తున్నారు.రోహిత్ శర్మ జట్టు బయట నుంచి కూడా టీమ్ కోసం పోరాడుతున్నాడని, హార్దిక్ పాండ్య బ్యాడ్ కెప్టెన్సీ నిర్ణయాలను సరి చేస్తున్నాడని అంటున్నారు. ఆ మధ్య కేకేఆర్ తో మ్యాచ్ సమయంలో రోహిత్ బయట నుంచి ఫీల్డింగ్ లో మార్పుల గురించి సూచనలు చేశాడని గుర్తు చేస్తున్నారు.