Rishabh Pant: ప్రపంచంలోనే రిచెస్ట్ లీగ్ అయిన ఐపీఎల్ లో రిషభ్ పంత్ ఖరీదైన క్రికెటర్ గా కొనసాగుతున్నాడు. ఈ సీజన్ ముందు జరిగిన మెగా వేలంలో అతడిని రూ. 27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనగులు చేసింది. పైగా అతడికే సారథ్య బాధ్యతలు కూడా అప్పగించింది. మరి రూ.27 కోట్ల ఆటగాడు అంటే అంచనాలు కూడా అలానే ఉంటాయి. పైగా అతడు పంత్. మరి ఈ స్థాయి క్రికెటర్ ఎలాంటి ప్రదర్శన చేయాలి? దుమ్ముదులపాలి కదా. కానీ అవేమీ కనపట్లేడు, తనపై పెట్టిన ధరకు న్యాయం చేయలేక తుస్సు మనిపించాడు. ఇప్పటివరకు జరిగిన మ్యాచుల్లో ఆటగాడిగా, కెప్టెన్ గా.. రెండింటిలోనూ విఫలమయ్యాడు.
మూడు సార్లు సున్నానే...
ఈ సీజన్ లో లక్నో తొమ్మిది మ్యాచ్లు ఆడితే.. అందులో ఐదింటిలో మాత్రమే విజయం సాధించింది. నాలుగు ఓటములను అందుకుంది. ఈ మ్యాచుల్లో పంత్.. అత్యధిక స్కోరు 63. అది చెన్నై జట్టుపై చేశాడు. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్ పై 21 పరుగులు సాధించాడు. ఇది అతడి రెండో అత్యధిక స్కోరు. మిగతా ఆరు మ్యాచుల్లోనూ సింగిల్ డిజిట్ కు మాత్రమే పరిమితమయ్యాడు. అందులోనూ మూడుసార్లు సున్నాకే ఔట్ అయిపోయాడు. అలా కెప్టెన్ గా, ఆటగాడిగా నిరుత్సాహపరిచాడు.
భారత జట్టు స్థానంపై ప్రభావం..
ఈ ఐపీఎల్ ప్రదర్శన, భారత జట్టులో కూడా అతడి స్థానంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. గత టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన టీమిండియాలో.. మొదటి వికెట్ కీపర్గా పంత్ కే ఛాన్స్ దక్కింది. కానీ, అతడు 8 మ్యాచుల్లో 130 స్ట్రైక్రేట్తో 171 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత టీ20ల్లో మళ్లీ అతడికి ఛాన్స్ రాలేదు. ఛాంపియన్స్ ట్రోఫీలో పంత్ ను పక్కకుపెట్టి కేఎల్ రాహుల్ కు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. అతడు దాన్ని సద్వినియోగం చేసుకుని అదరగొట్టాడు. ఇప్పుడు ఐపీఎల్లోనూ అతడు సత్తా చాటుతున్నాడు. ఇక టీ20ల్లోనూ కేఎల్ రాహుల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే మాత్రం.. పంత్ జట్టుకు దూరమవ్వాల్సిందే. కాబట్టి భారత జట్టులో అతడి స్థానానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందని పలువురి అభిప్రాయం. కానీ, బీసీసీఐ రీసెంట్ గా ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్ట్ల్లో పంత్కు గ్రేడ్ A లభించింది. అయినా కూడా ఫామ్ ఉంటేనే అవకాశాలు. లేదంటే రాహుల్ తో పాటు జితేశ్, సంజు శాంసన్ సహా ఇతర క్రికెటర్ల నుంచి గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇకపోతే 2026 టీ20 వరల్డ్ కప్ లోనూ పంత్ ప్లేస్ ను కేఎల్ రాహుల్ రీప్లేస్ చేసే అవకాశముందని లోబో అనే జ్యోతిష్కుడు కూడా అభిప్రాయపడ్డాడు.
