IPL 2025: ఐపీఎల్ 2025 ఉత్సాహం ప్రస్తుతం నిలిచిపోయింది. భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా ఈ టోర్నమెంట్ వారం పాటు వాయిదా పడింది. అయితే టోర్నమెంట్లోని మిగిలిన మ్యాచ్లకు సంబంధించిన కొత్త షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామని బీసీసీఐ చెబుతోంది. ఐపీఎల్ ఈ నెల 16 లేదా 17 నుంచి ప్రారంభం కావచ్చని తెలుస్తోంది. అయితే భద్రతా కారణాలను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ అన్ని మ్యాచ్లను 3 నుంచి 4 వేదికలలో మాత్రమే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. కానీ ఐపీఎల్ తిరిగి ప్రారంభం కావడం అనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఐపీఎల్ ను తిరిగి ప్రారంభించడంపై ఐపీఎల్ పాలకవర్గ సభ్యులు, బీసీసీఐ అధికారులు ఆదివారం చర్చలు జరిపారు. బీసీసీఐ షెడ్యూలును సిద్ధం చేస్తోందని బోర్ఢు ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. ఐపీఎల్ తిరిగి ప్రారంభం కానున్నందున ఆటగాళ్లను వెనక్కి పిలవాలని ఫ్రాంచైజీలను బీసీసీఐ ఆదేశించింది.
ఐపీఎల్ టోర్నమెంట్లో మిగిలిన మ్యాచ్లను డబుల్ హెడర్లతో ముగించనున్నట్లు తెలుస్తోంది. జూన్ 1న ఫైనల్ మ్యాచ్ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఐపీఎల్ లో మిగిలిన 16 మ్యాచ్లను కేవలం 4 నగరాలు హైదరాబాద్, కోల్కతా, చెన్నై, బెంగళూరులలో నిర్వహించే అవకాశం ఉంది. ఐపీఎల్ను నిర్వహించడానికి ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని బీసీసీఐ సెక్రటరీ దేవ్జిత్ సైకియా అన్నారు.

కానీ అభిమానుల మదిలో మెదులుతున్న ప్రశ్న ఏమిటంటే కొత్త షెడ్యూల్లోని మొదటి మ్యాచ్లో ఏ రెండు జట్లు ఆడతాయి? ధర్మశాలలో అకస్మాత్తుగా రద్దు చేయబడిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ లేదు. నివేదిక ప్రకారం.. మొదటి మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగవచ్చు. అయితే ఈ మ్యాచ్ వేదిక ఖచ్చితంగా మారవచ్చు. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో ముందుగా జరగాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఈ మ్యాచ్ ఆతిథ్య బాధ్యతను బెంగళూరులోని చిన్నస్వామి స్డేడియంలో జరిగే అవకాశముంది.
పంజాబ్-ఢిల్లీ మ్యాచ్ జరుగుతుందా?
భారత్, పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ తర్వాత బీసీసీఐ ఈ మ్యాచ్ను వెంటనే రద్దు చేయాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఈ మ్యాచ్ గురించి ఇంకా ఎటువంటి అప్డేట్ రాలేదు. రెండు జట్లకు ఒక్క పాయింట్ కూడా ఇవ్వలేదు. ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య మళ్లీ మ్యాచ్ జరగవచ్చని భావిస్తున్నారు. కానీ దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.