ఉత్కంఠకు తెరపడింది. ఐపీఎల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రిటెన్షన్ ప్లేయర్ల జాబితా ఆదివారం విడుదలైంది. ఆటగాళ్ల సామర్థ్యాన్ని అంచనా వేస్తూ, ఆర్థిక వ్యూహాలతో పది ఫ్రాంచైజీలు తమ రిటెన్షన్ జాబితాలను ప్రకటించింది. ఊహించినట్లుగానే కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ అత్యధికంగా ఆరుగురు ప్లేయర్లను, పంజాబ్ కింగ్స్ అత్యల్పంగా ఇద్దరిని మాత్రమే అట్టిపెట్టుకుంది. ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్లోనూ సీఎస్కేలో కొనసాగనున్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముగ్గురు ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. కెప్టెన్ డుప్లెసిస్తో సహా ఏ విదేశీ ప్లేయర్ను అట్టిపెట్టుకోలేదు. విరాట్ కోహ్లి, రజత్ పటిదార్, యశ్ దయాల్ను ఆర్సీబీ తమ ఫ్రాంచైజీలో కొనసాగించింది. విరాట్ కోహ్లికి అత్యధికంగా రూ.21 కోట్లు, రజత్ పటిదార్కు రూ.11 కోట్లు, అన్క్యాప్డ్ ప్లేయర్ యశ్ దయాల్కు రూ.5 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకుంది.

అయితే ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ను రిటైన్ చేసుకోవాలని భావించామని, కానీ గాయం కారణంగా అతన్ని అట్టిపెట్టుకోలేదని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ బొబాట్ పేర్కొన్నాడు. గత సీజన్కు ముందు గ్రీన్ను రూ.17.5 కోట్లు వెచ్చించి ఆర్సీబీ ట్రేడ్ చేసుకుంది. 2024 సీజన్లో గ్రీన్ 255 పరుగులు, 10 వికెట్లు సాధించాడు. అయితే వెన్నునొప్పితో బాధపడుతున్న గ్రీన్ ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు. కనీసం ఆరు నెలల పాటు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ఐపీఎల్ 2025 సీజన్కు దూరమయ్యే అవకాశం ఉండటంతో, పర్స్ వ్యాల్యూలో అధిక మొత్తం ఉంచుకోవడానికి ఆర్సీబీ కామెరూన్ గ్రీన్ రిటైన్ చేసుకోలేదని బొబాట్ తెలిపాడు. ''మేం మరో ప్లేయర్రు రిటైన్ చేసుకోవాలని భావించాం. అతనే కామెరూన్ గ్రీన్. కానీ దురదృష్టవశాత్తు గాయం కారణంగా అతను ఐపీఎల్కు దూరమయ్యాడు'' అని బొబాట్ తెలిపాడు.
కాగా, ముగ్గురిని మాత్రమే రిటైన్ చేసుకున్న ఆర్సీబీ వద్ద రూ.83 కోట్లు, మూడు ఆర్టీఎమ్ కార్డ్స్ ఉన్నాయి. మెగా వేలంలో ఆర్టీఎమ్ కార్డ్స్తో రిలీజ్ చేసిన ముగ్గురిని తిరిగి ఆర్సీబీ సొంతం చేసుకోవచ్చు. మహ్మద్ సిరాజ్, డుప్లెసిస్, మాక్స్వెల్, విల్ జాక్స్లలో ముగ్గురిని తిరిగి దక్కించుకోవాలని ఆర్సీబీ భావిస్తోంది.