RCB VS PBKS: ఐపీఎల్ 2025లో వర్షం కారణంగా 14 ఓవర్లకు కుదించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచులో యాదృచ్ఛికంగా ఓ అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విషయంలో ఇది జరిగింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీంతో క్రికెట్ అభిమానులంతా 18ఏళ్ల తర్వాత సేమ్ సీన్ రిపీట్.. అంటూ కామెంట్లు చేస్తూ తెగ హల్ చల్ చేస్తున్నారు.
ఇంతకీ ఆ అనూహ్య సంఘటన ఏంటంటే?
ఈ మ్యాచులో విరాట్ కోహ్లీ 3 బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు మాత్రమే చేశాడు. అర్ష్దీప్ బౌలింగ్లో పెవిలియన్ చేరాడు. అయితే సరిగ్గా 18 ఏళ్ల కిందట కూడా జరిగింది. ఇదే రోజు(ఏప్రిల్ 18).. ఐపీఎల్ తొలి ఎడిషన్ (2008) తన అరంగేట్ర మ్యాచులో కోల్కతా నైట్ రైడర్స్తో (కేకేఆర్) జరిగిన మ్యాచులోనూ విరాట్ కోహ్లీ (1) ఒక్క పరుగుకే వెనుదిరగడం గమనార్హం. అప్పుడు కూడా ఈ మ్యాచ్ బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగానే జరిగింది.
అప్పుడు విరాట్ కోహ్లీకి 19 ఏళ్లు. ఆ సమయంలో మూడో స్థానంలో బ్యాటింగ్ కు దిగిన విరాట్.. ఐదు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగు చేశాడు. కేకేఆర్ పేసర్ అశోక్ దిండా.. కోహ్లీని ఔట్ చేశాడు. దీంతో 18 ఏళ్లు అయినా కూడా ఏప్రిల్ 18న రోజు విరాట్ కోహ్లీ రాత మాత్రం మారలేదంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆ మ్యాచులో కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. కానీ ఆర్సీబీ అప్పుడు కూడా చతికిలపడింది. కేవలం 82 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 140 పరుగుల తేడాతో భారీ పరాజయాన్ని అందుకుంది.

కాగా, ప్రస్తుత మ్యాచ్ విషయానికొస్తే.. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ బౌలర్ల దెబ్బకు ఆర్సీబీ బ్యాటర్లు విలవిలలాడారు. వరుసగా ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ కు చేరారు. దీంతో ఆర్సీబీ 14 ఓవర్లలో కేవలం 95 పరుగులు మాత్రమే చేసింది. ఆఖర్లో టిమ్ డేవిడ్ కాస్త వేగంగా ఆడడం వల్ల ఆర్సీబీ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. అనంతరం లక్ష్యాన్ని పంజాబ్ కింగ్స్ 12.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించి విజయాన్ని అందుకుంది.