రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్ న్యూస్. గత 17 ఐపీఎల్ సీజన్లలో ఒక్కసారి కూడా ట్రోఫీ గెలవలేకపోయిన ఆర్సీబీ.. ఈసారి కొత్త కెప్టెన్సీతో బరిలోకి దిగేందుకు సిద్ధమైంది. అయితే ఇప్పటి వరకు కోహ్లీ పేరు ప్రచారంలో ఉండగా.. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. అతడికే జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించడం దాదాపుగా ఖాయమైపోయిందని తెలిసింది. ఇంతకీ ఆ ప్లేయర్ ఎవరో తెలుసుకుందాం.
మళ్లీ ఈ సాలా కప్ మనదే..
పైకి బలంగా కనిపిస్తుంది. అలాగే కొన్ని మ్యాచుల్లో మెరుపులు కూడా మెరిపిస్తుంది. కానీ లీగ్ పూర్తయ్యే సమయానికి ఆ జట్టు చేతిలో కప్పు మాత్రం కనిపించదు. అదే ఆర్సీబీ అన్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ లాంటి స్టార్ బ్యాటర్ ఉన్నా ఆ జట్టు తలరాత ఇప్పటి వరకు మారలేదు. అయినప్పటికీ క్రేజ్ విషయంలో మాత్రం అగ్రశ్రేణి జట్లతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఆర్సీబీ. ఎప్పటి లాగే ఈ సారి కూడా ఈ సాలా కప్ నమ్ దే అంటూ బరిలోకి దిగనుంది.

రూ.11 కోట్ల ప్లేయర్ కు కెప్టెన్సీ..
అయితే కోహ్లీ కెప్టెన్ గా దిగిపోయాక.. ఫాఫ్ డుప్లెసిస్ అయినా ఆర్సీబీ తలరాత మారుస్తాడనుకుంటే అది జరగలేదు. దీంతో అతడిని పక్కకు పెట్టేసింది యాజమాన్యం. ఈ క్రమంలో తాజా సీజన్ కు ఎవరు సారథ్యం వహిస్తారనే ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతూనే ఉంది. కోహ్లీనే మళ్లీ సారథ్య బాధ్యతలు తీసుకుంటాడని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు మరో రెండు కొత్త పేర్లు తెరపైకి వచ్చాయి. విరాట్ కెప్టెన్సీ తీసుకోవడానికి ఆసక్తి చూపకపోవడంతో.. యువ ఆటగాడు రజత్ పాటిదార్ పేరు గట్టిగా వినిపిస్తోంది. జట్టు భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని.. రూ.11 కోట్లకు కొనుగోలు చేసిన అతడికే జట్టు పగ్గాలు అప్పజెప్పనుంది తెలిసింది.
పాటిదార్ రికార్డులు..
పాటిదార్ ఇప్పటికే సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ కెప్టెన్ గా తన జట్టును ఫైనల్ కు తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ సీజన్లో 9 ఇన్నింగ్స్ లో 428 పరుగులతో సెకండ్ హైయెస్ట్ రన్నర్ గా నిలిచాడు. ఐపీఎల్ లోనూ రజత్ పాటిదార్ తన బ్యాటింగ్ స్కిల్స్ తో ఆకట్టుకున్నాడు. మొత్తం 27 మ్యాచ్లు ఆడి, 799 పరుగులు చేశాడు. ఇందులో 7 అర్ధశతకాలు, ఒక శతకం ఉన్నాయి. ఐపీఎల్ లో అతడి అత్యధిక వ్యక్తిగత స్కోర్ 112.
మరో ఛాయిస్ ఇతడే..
లేదంటే కృనాల్ పాండ్యకు సారథ్య బాధ్యతలు అప్పగించొచ్చని సమాచారం అందింది. ఇప్పటికే కృనాల్.. ఆల్ రౌండర్ గా, బరోడా కెప్టెన్ గా దేశవాళీ క్రికెట్ లో బలమైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే.