IPL 2025 Virat Kohli: ఐపీఎల్ 2025 సీజన్ లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన 9 మ్యాచుల్లో 5 హాఫ్ సెంచరీలతో 392 పరుగులు చేశాడు. తాజాగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచులోనూ 42 బంతుల్లో ఎదుర్కొన్న కోహ్లీ.. 8 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 70 పరుగులు హాఫ్ సెంచరీ సాధించాడు. జట్టు భారీ స్కోరు (205/5) చేయడంతో పాటు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో ఈ సీజన్ లో హోమ్ స్టేడియంలో ఎట్టకేలకు ఆర్సీబీ తొలి విజయాన్ని అందుకుంది. పాయింట్ల పట్టికలోనూ మూడో స్థానానికి చేరుకుని, ప్లే ఆఫ్స్ రేసులో ముందుంది.
రెండో స్థానంలో కోహ్లీ...
ప్రస్తుతం ఐపీఎల్ 18వ సీజన్ లో అతడు ఆరెంజ్ క్యాప్ రేసులో 65.33 సగటుతో, 144.11 స్ట్రైక్ రేటుతో 392 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక అతడి మైండ్ సెట్ విషయానికొస్తే.. ఎంతో మంది యువ క్రికెటర్లకు కూడా స్ఫూర్తిగా నిలుస్తోందనే చెప్పాలి. 18 ఏళ్లుగా నిలకడంగా ఆడుతూ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంటున్నాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీపై RCB మెంటార్, బ్యాటింగ్ కోచ్ దినేశ్ కార్తిక్, విరాట్ కోహ్లిపై ప్రశంసలు కురిపించారు.
మాటలు రావడం లేదు..
"విరాట్ కోహ్లీ గురించి ఏమని చెబుతాం. అతడిలో ఆటపట్ల ఉన్న ఆ తపన చూసి మాటలు రావడం లేదు. IPLను 18 సంవత్సరాల నుంచి ఆడటం ఒకెత్తైతే.. అదే 18 ఏళ్లుగా స్థిరంగా ఆటడం మరొక ఎత్తు. RCB హోమ్ గేమ్స్ లో ఓడిపోయిన తర్వాత కోహ్లీ తనను తాను ఆత్మవిమర్శ చేసుకున్నాడు. తనతో పాటు జట్టు ఇంకొంచెం బాగా బెటర్ గా ఎలా ఆలోచించాలి, ఎలా ఆడాలి అని అనుకుంటాడు. ఎంతో మంది అభిమానులు తన బ్యాటింగ్ చూడడానికి మాత్రమే స్టేడియానికి వస్తారని అతడికి తెలుసు. ఐపీఎల్ లో కోహ్లీ బెస్ట్ బ్యాటర్. ఆటను, పరిస్థితులను అతడు అర్థం చేసుకునే తీరు అద్భుతం. ఇంకా చెప్పాలంటే కోహ్లీ గురించి మాట్లాడేంత వ్యక్తిని కాదు. నేను చాలా చిన్న వాడిని. అతడు ఒక అసలైన ఛాంపియన్." అని దినేశ్ కార్తిక్ పేర్కొన్నాడు. కాగా, ఏప్రిల్ 27న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన తర్వాతి మ్యాచును దిల్లీ క్యాపిటల్స్ తో ఆడనుంది.
