IPL 2025: మంగళవారం రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పంజాబ్ కింగ్స్ జట్టును 6 పరుగుల తేడాతో ఓడించి ఐపీఎల్ 2025లో కొత్త చరిత్రను సృష్టించింది. 18 ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్సీబీ అభిమానుల కల ఎట్టకేలకు నెరవేరింది. జూన్ 3 రాత్రి ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ జోష్ హేజిల్వుడ్ పంజాబ్ బ్యాటర్ శశాంక్ సింగ్కు చివరి బంతిని బౌలింగ్ చేయగానే స్టేడియం మొత్తం సందడితో నిండిపోయింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఆర్సీబీ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది.
చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
వాస్తవానికి ఇప్పుడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ జట్టు తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL), ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) టైటిళ్లను గెలుచుకున్న రెండో ఫ్రాంచైజీగా అవతరించింది. ఆర్సీబీ మహిళా జట్టు గత సంవత్సరం ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో బలమైన ప్రదర్శన ఇచ్చి టైటిల్ను గెలుచుకుంది. అప్పుడు ఎల్లిస్ పెర్రీ, స్మృతి మంధాన, రేణుకా సింగ్ వంటి క్రీడాకారణుల అద్భుతమైన ప్రదర్శన ఆధారంగా ఆర్సీబీ మహిళా జట్టు ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను ఓడించి చరిత్ర సృష్టించింది. ఈ విజయం మహిళా జట్టుకు మాత్రమే కాదు.. మొత్తం ఆర్సీబీ ఫ్రాంచైజీకి కూడా పెద్ద విజయంగా మారింది.

మొదట ఆ రికార్డును సృష్టించిన ముంబై
ఈ ఘనత సాధించిన మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ముంబై పురుషుల జట్టు ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది. కానీ 2023లో ముంబై ఇండియన్స్ మహిళల జట్టు మొదటి సారి డబ్ల్యూపీఎల్ టైటిల్ను గెలుచుకున్నప్పుడు ఆ జట్టుటకు ప్రత్యేక క్షణం వచ్చింది. ముంబై తర్వాత ఇప్పుడు ఆర్సీబీ కూడా ఈ ఘనతను సాధించింది. భారత క్రికెట్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల జాబితాలో ఆర్సీబీ చేరింది.