ఐపీఎల్ 2025లో తాజాగా జరిగిన ఉత్కంఠ పోరులో ముంబయి ఇండియన్స్ ను 12 పరుగుల తేడాతో ఓడించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. తద్వారా ఒకే సీజన్ లో సీఎస్కే, కేకేఆర్, ఎంఐపై వరుసగా ఆతిథ్య గడ్డపై హ్యాట్రిక్ విజయాలను అందుకున్న రెండో జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఉత్కంఠ విజయం ఆర్సీబీకి అంత ఈజీగా దక్కలేదు. ఎందుకంటే ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య ఓ దశలో ఆర్సీబీని వణికించాడు. దీంతో అప్పటివరకు ఎంతో ఉత్సాహంలో ఉన్న ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా హార్దిక్ ప్రదర్శనతో కాసేపు భయపడిపోయారు.
ఈ మ్యాచులో మొదట ఆర్సీబీ 221 భారీ స్కోర్ చేసింది. ముంబయి ఇండియన్స్ కు 222 సవాల్ విసిరే లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే ఎంఐ మొదట 12 ఓవర్లలో కేవలం 99 పరుగులే చేసింది. అప్పుడు వచ్చాడు హీరో, ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య. నెం.6వ స్థానంలో వచ్చి బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. జోష్ హెజిల్వుడ్ వేసిన 14 ఓవర్లలో ఏకంగా 22 పరుగులు సాధించాడు. అందులో రెండు సిక్సలు, ఓ ఫోర్ ఉన్నాయి. ఎదుర్కొన్న తొలి మూడు బంతుల్నే 6, 4, 6గా మల్చాడు. అనంతరం సోదరుడు కృనాల్ పాండ్య వేసిన తర్వాతి ఓవర్ లోనూ రెండు సిక్సలు బాదాడు. దీంతో ఆ ఓవర్ లో ముంబయి ఇండియన్స్ 19 పరుగులు చేసింది. ఈ రెండు ఓవర్లే మ్యాచును కాస్త మలుపు తిప్పేలా చేసి.. ఆర్సీబీ ఫ్యాన్స్ ను భయపెట్టేలా చేసింది.

మొత్తంగా 8 బంతుల్లో 33 పరుగుల చేసిన హార్దిక్ పాండ్య.. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కూడా చేసేలా కనిపించాడు. కానీ చివరికి 15 బంతుల్లో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. అలా హార్దిక్ తన ప్రదర్శనతో ఆర్సీబీని, ఆ జట్టు అభిమానులను కాసేపు ఫుల్ గా టెన్షన్ పెట్టాడు. అందరూ ఎక్కడ ఓడిపోతామేమోనని తెగ భయపడిపోయారు. ఇక ఆ తర్వాత మళ్లీ మ్యాచ్ ఆర్సీబీవైపు తిరిగింది. హార్దిక్ ఔట్ అవ్వడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. చివరిగా ఆర్సీబీ 12 పరుగులు తేడాతో గెలిచింది.