ప్రస్తుత జనరేషన్లోని చాలా మంది భారత క్రికెటర్లు.. దిగ్గజ క్రికెట్ త్రయం సచిన్ తెందుల్కర్, రాహుల్ ద్రవిడ్, గంగూలీని చూసి స్ఫూర్తి చెంది క్రికెట్లోకి వచ్చిన వాళ్లే. వారి ఆట చూస్తూనే పెరిగారు. అయితే తాజాగా రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ నితీశ్ రానా.. ఈ ముగ్గురిని చూస్తూ తాను పెరిగిన రోజులను గుర్తుచేసుకున్నాడు. ఈ ముగ్గురి వల్ల తమ ఇంట్లో ఎన్నో గొడవలు జరిగేవని నాటి రోజులను నెమరువేసుకున్నాడు.
మా ముగ్గురి మధ్య ఎప్పుడూ గొడవలే..
"మా నాన్న సచిన్ తెందుల్కర్ కు వీరాభిమాని. నేను గంగూలీని బాగా ఇష్టపడతాను. నా సోదరుడు రాహుల్ ద్రవిడ్ ను బాగా ఇష్టపడతాడు. కాబట్టి టీమిండియా మ్యాచులు జరిగేటప్పుడు మా ఇంట్లో గొడవలు తప్పవు. ఆటగాళ్ల విషయంలో ఫైటింగ్స్ కామన్ గా జరిగేవి. ఈ ముగ్గురిలో ఎవరూ ఔట్ అయినా, మా ఇంట్లో ఎవరో ఒకరు నిరాశ చెందడం, బాధ పడటం, కోపం తెచ్చుకోవడం జరిగేవి. ఈ ముగ్గురు ఒకేసారి కలిసి అద్భుతంగా రాణించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. రాహుల్ ద్రవిడ్ కెరీర్ పీక్ లో ఉన్నప్పుడు, నేను, నా సోదరుడు బాగా పోట్లాడుకునేవాళ్లం. మా ఇద్దరి మధ్య చాలా గొడవలు జరిగేవి. మా నాన్నగారికి మేము ఏమీ చెప్పలేకపోయాం" అని నితీశ్ అన్నాడు.

ఎంతో గౌరవంగా భావిస్తున్నా...
నితీశ్ రాణా భారత్ తరఫున తన తొలి టూర్ ఆడినప్పుడు, ద్రవిడ్ కోచ్గా వ్యవహరించాడు. ఇది తనకు ఓ ప్రత్యేకమైన అనుభూతి అని చెప్పాడు నితీశ్. "నా అరంగేట్రం రాహుల్ సర్ కోచ్ గా ఉన్న సమయంలో జరిగింది. చిన్నప్పుడు ఆయన గురించి వాదించుకుంటూ పెరిగిన నేను, ఇప్పుడు ఆయన కోచింగ్లో ఆడడం నిజంగా గొప్ప విషయం. ఇది నా జీవితంలో ఓ ప్రత్యేకమైన అనుభూతి. ఎంతో గౌరవంగా భావిస్తున్నాను." అని చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్నాడు రాణా. ఇటీవలే చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో అద్భుత ఇన్నింగ్స్ ఆడి 81 పరుగులు (36 బంతుల్లో) చేశాడు నితీశ్ రాణా. రాజస్థాన్ రాయల్స్ 182/9 పరుగులు చేయగా, సీఎస్కే 176/6 మాత్రమే చేయగలిగింది. దీంతో రాజస్థాన్ విజయం సాధించింది. కాగా, రాజస్థాన్ జట్టుకు రాహుల్ ద్రవిడ్ కోచ్ గా ఉన్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ రాయల్స్ తన తర్వాతి మ్యాచును పంజాబ్ కింగ్స్ తో ఏప్రిల్ 5న ఆడనుంది.