టీమిండియా మాజీ హెడ్ కోచ్, రాజస్థాన్ రాయల్స్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మరోసారి క్రికెట్ అభిమానుల మనసును దోచుకున్నాడు. క్రికెట్ పై తనకున్న ప్రేమ, నిబద్ధత, అంకితభావం చూపాడు. కాలికి పెద్ద గాయమైన కూడా.. ఏ మాత్రం లెక్కచేయకుండా.. మైదానంలోకి దిగి తన ఆటగాళ్లకు శిక్షణ ఇచ్చాడు.
నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతో..
రాహుల్ ద్రవిడ్ క్రికెట్ ఆడుతుంటే, అతడి కాలికి ఇటీవలే పెద్ద గాయమైంది. ఎడమ కాలికి దెబ్బ తాకింది. దీంతో అతడి కాలికి పెద్ద కట్టు కట్టారు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ దగ్గర పడుతోన్న అన్ని జట్లు తమ కోచ్ ల ఆధ్వర్యంలో ప్రాక్టీస్ చేస్తున్నాయి. కానీ రాజస్థాన్ మాత్రం కోచ్ లేకుండానే సాధన చేయాల్సి వచ్చింది. దీంతో రాహుల్ ద్రవిడ్ తనకు తగిలిన గాయాన్ని పట్టించుకోకుండా అలానే మైదానంలోకి దిగాడు. తన వల్ల జట్టుకు ఎలాంటి నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతో ట్రైనింగ్ క్యాంపులో చేరాడు.
ఊత కర్రల సాయంతో..
సరిగా నడవలేని స్థితిలో ఉన్నప్పటికీ.. ఊతకర్రల సాయంతో రాహుల్ జైపూర్లోని ట్రైనింగ్ క్యాంప్నకు వచ్చాడు. తాను ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆటగాళ్లకు శిక్షణ కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను రాజస్థాన్ రాయల్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలాంటి కోచ్ను ఇంకెక్కడా చూడలేం. రాహుల్ కు గాయమవ్వడం బాధాకరమైన విషయం' అని రాసుకొచ్చింది. ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు.. ఇలాంటి కోచ్ ఉంటే జట్టుకు విజయం పక్కా, ఇలాంటి కోచ్ దొరకడం అదృష్టం అంటూ ద్రవిడ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
