ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా జరిగిన ఆక్షన్లో మొత్తంగా 182 మంది ఆటగాళ్ల కోసం 10 ఫ్రాంఛైజీలు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. గత 17 సీజన్లుగా ప్రతిసారి ఫేవరేట్గా బరిలోకి దిగి కప్ను అందుకోలేక రిక్తహస్తాలతో వెనుదిరుగుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి వేలంలో సంయమనంతో వ్యవహరించింది. తొలిసారి స్టార్ ప్లేయర్ల కోసం పోటీపడకుండా పటిష్టమైన తుదిజట్టు నిర్మాణం కోసం ఆర్సీబీ తీవ్రంగా శ్రమించింది.
గతంలో స్టార్లను నమ్ముకుని టైటిల్ను అందుకోలేకపోయిన బెంగళూరు మేనేజ్మెంట్ తమ ప్రణాళికలను మార్చుకుంది. దూకుడుగా వ్యవహరించకుండా మెగా వేలంలో ఏకంగా రూ.75 లక్షలను మిగిల్చుకుంది. రెండు ఆర్టీఎమ్లను ఉపయోగించనే లేదు. మహ్మద్ సిరాజ్, గ్లెన్ మ్యాక్స్వెల్, విల్ జాక్స్లను ఆర్టీఎమ్తో ఆర్సీబీ సొంతం చేసుకోలేదనే పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి.

అయితే వేలంలో ఆర్సీబీ వ్యవహరించిన తీరును టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కొనియాడాడు. అలాగే ఆర్సీబీ కెప్టెన్సీ పగ్గాలను విరాట్ కోహ్లి తిరిగి అందుకుంటాడని అభిప్రాయపడ్డాడు. ''వేలంలో ఆర్సీబీ అద్భుతంగా వ్యవహరించింది. బ్యాలెన్స్గా ఉంటూ సంయమనంతో ఎదురుచూశారు. ఎన్నో ఫ్రాంచైజీలు భారీ మొత్తంతో వేలంలోకి వచ్చాయి. వాళ్లు వేలంలో దూకుడుగా ముందుకు వెళ్లారు. కానీ ఆర్సీబీ వద్ద ఎంతో డబ్బు ఉన్నప్పటికీ ఓపికగా వ్యవహరించింది''
''మనకు ఎవరు కావాలి? వాళ్ల కోసం మనం ప్రయత్నించాలి. ఓవరాల్గా టీమ్ నాకు ముఖ్యం. 12 నుంచి 14 మంది ఆటగాళ్లు కావాలి. మన పరిస్థితుల్లో పనికొచ్చేలా తీసుకోవాలి. ఆర్టీఎమ్లు ఉన్నా, అవసరం లేకపోతే ఉపయోగించకూడదు. అంతిమంగా నాకు కావాల్సిన ఆటగాళ్లను దక్కించుకోవాలి.. అనే తీరులో వేలంలో ఆర్సీబీ పాల్గొంది''
''ఇక విరాట్ కోహ్లి కెప్టెన్గా బాధ్యతలు తీసుకుంటాడని భావిస్తున్నాను. వాళ్లు కెప్టెన్ కోసం వేలంలో వెళ్లలేదు కాబట్టి భావిస్తున్నాను. మరొకరిని నియమించాలని భావిస్తే తప్ప కోహ్లినే కెప్టెన్. కోహ్లి కాకుండా మరో ప్లేయర్ ఆర్సీబీ జట్టు పగ్గాలు అందుకుంటాడని భావించట్లేదు'' అని రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్లో పేర్కొన్నాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ధర- రూ.కోట్లలో)
విరాట్ కోహ్లి (21), జోస్ హేజిల్వుడ్ (12.50), ఫిలిప్ సాల్ట్ (11.50), జితేశ్ శర్మ, రజత్ పటిదార్ (11), భువనేశ్వర్ (10.75), లివింగ్స్టన్ (8.75), రసిక్ సలాం (6), కృనాల్ పాండ్య (5.75), యశ్ దయాల్ (5), టిమ్ డేవిడ్ (3), బెతెల్, సుయాశ్ శర్మ(2.60), దేవదత్ పడిక్కల్ (2), నువాన్ (1.60), షెఫర్డ్ (1.50), ఎంగిడి (1), స్వప్నిల్ (0.50), స్వస్తిక్, మనోజ్, అభినందన్, మోహిత్ (0.30).