IPL 2025: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2025లో భాగంగా పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరగాల్సిన 58వ లీగ్ మ్యాచ్ భద్రతా కారణాల దృష్ట్యా మధ్యలో ఆగిపోయింది. మ్యాచ్ మధ్యలోనే ఆగిపోవడంతో పాయింట్ల పట్టికలో ఏ జట్లకు పాయింట్లు లభించలేదు. ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆ జట్టు 10.1 ఓవర్లలో 122 పరుగులు చేసి ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. సరిగ్గా ఆ సమయంలో స్టేడియంలోని లైట్లు ఒకదాని తర్వాత ఒకటి ఆరిపోయాయి. ఆటగాళ్లు, అభిమానులను స్టేడియం వదిలి వెళ్లమని కోరారు. సాంకేతిక సమస్యల కారణంగా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.
అయితే ఈ మ్యాచ్ మళ్లీ వేరే ప్రదేశంలో మరో రోజున జరుగుతుందా? లేక మ్యాచ్ను రద్దు చేశారా? అనేది ఇంకా తెలియరాలేదు. ఈ సమాచారం ఇంకా అధికారికంగా వెలువడలేదు. మ్యాచ్ రద్దు అయితే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లకు చెరో పాయింట్ లభిస్తుంది. ఇప్పటికే వర్షం కారణంగా ఈ రెండు జట్లు ఆడిన ఒక మ్యాచ్ ఫలితం లేకుండా రద్దు చేయబడింది. ఆ మ్యాచ్లలో చెరొక పాయింట్ మాత్రమే కలిగి ఉండటం గమనార్హం. రెండు జట్లకు చెరొక పాయింట్ ఇస్తే.. పంజాబ్ కింగ్స్ జట్టు 12 మ్యాచ్ల తర్వాత 16 పాయింట్లను కలిగి ఉంటుంది. ఢిల్లీ క్యాపిటల్స్ 12 మ్యాచ్ల తర్వాత 14 పాయింట్లను కలిగి ఉంటుంది.

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ 11 మ్యాచ్ల్లో 15 పాయింట్లు, ఢిల్లీ క్యాపిటల్స్ 11 మ్యాచ్ల్లో13 పాయింట్లు సాధించాయి. ఈ మ్యాచ్ ఫలితాలు, స్టాండింగ్లను బీసీసీఐ త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.