IPL 2025: ఐపీఎల్ 2025 టోర్నమెంట్లో తనకు ఇష్టమైన జట్టు ఏదో.. అలాగే ఏ జట్టు ట్రోఫీని గెలుచుకోబోతోందో భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఈ ఐపీఎల్ సిరీస్లో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటివరకు ట్రోఫీ గెలవని పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ కూడా ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో ఐదు మ్యాచ్ల చొప్పున విజయం సాధించాయి. ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉంది.
ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లలో 6 జట్లు బాగా ఆడాయి. ఈ 6 జట్లలో నాలుగు జట్లు మాత్రమే ప్లేఆఫ్స్ కు చేరుకుంటాయని భావిస్తున్నారు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్ తన అంచనా గురించి మాట్లాడారు. యువీ పోస్ట్ చేసిన వీడియోలో.. ఈ సంవత్సరం తనకు ఇష్టమైన జట్టు సన్రైజర్స్ హైదరాబాద్ అని చెప్పాడు. కానీ ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ ట్రోఫీని గెలుచుకుంటుందని కూడా వెల్లడించాడు.

సన్రైజర్స్ హైదరాబాద్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. అయినప్పటికీ యువరాజ్ సింగ్ ఆ జట్టును తనకు ఇష్టమైన జట్టు అని అనడానికి ఒక ప్రధాన కారణం ఉంది. యువరాజ్ సింగ్ ఎంపిక చేసిన అభిషేక్ శర్మ ఆ జట్టు తరఫున ఆడుతున్నాడు. అందుకే యువరాజ్ సింగ్ సన్రైజర్స్ హైదరాబాద్ను తనకు ఇష్టమైన జట్టుగా పేర్కొన్నాడు. అదే సమయంలో తాను పంజాబ్ కు చెందినవాడు కాబట్టి ఈ సంవత్సరం పంజాబ్ కింగ్స్ జట్టు ట్రోఫీని గెలుచుకుంటుందని చెప్పాడు. ఇదిలా ఉండగా.. శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ జట్టు ఈ సంవత్సరం బాగా ఆడుతోంది. ఆ జట్టు ప్లేఆఫ్స్ కు చేరుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో యువరాజ్ సింగ్ ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీని తమ జట్టు గెలుచుకుంటుందని సూచించాడు.