Rishabh Pant: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో విజయం అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ పై సెటైర్లు వేసింది పంజాబ్ కింగ్స్. వేలం సమయంలో పంత్ అన్న మాటలను తిప్పి కొడుతూ ట్రోల్ చేసింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ పంజాబ్ కింగ్స్ ఏం అన్నదంటే?
తాజాగా జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించి.. లక్నో జట్టును 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ముఖ్యంగా లక్నో కెప్టెన్ పంత్ ఈ సీజన్ లో దారుణంగా విఫలమవుతూ వస్తున్నాడు. ఈ సీజన్ తొలి మ్యాచులో డకౌట్ అయిన అతడు, రెండో మ్యాచులో 15 పరుగులే చేశాడు. ఇక ఇప్పుడు మూడో మ్యాచులో కేవలం రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరాడు. దీంతో అతడిపై దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.

అతడు తుస్సు.. ఇతడు సూపర్ హిట్..
ఎందుకంటే లక్నో.. పోటీ పడి మరీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర రూ.27 కోట్లకు పంత్ ను కొనుగోలు చేసింది. అతడు తమ జట్టను సమర్థవంతంగా ముందుకు నడిపించి విజయాన్ని అందిస్తాడని భావించి ఈ ధరకు దక్కించుకుంది. కానీ పంత్.. అటు కెప్టెన్గా, ఇటు బ్యాటర్గా విఫలమవుతున్నాడు. ఇదే సమయంలో పంజాబ్.. పంత్ కోసం పోటీ పడినప్పటికీ.. చివరికి శ్రేయస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు సొంతం చేసుకుంది. అంచనాలకు తగ్గట్టే ఈ సీజన్లో రెండు మ్యాచులు ఆడిన పంజాబ్ కింగ్స్ రెండింటిలోనూ గెలుపొందింది. రెండు మ్యాచ్లలోనూ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అద్భతంగా రాణించాడు. గుజరాత్ టైటాన్స్పై 97 పరుగులతో నాటౌట్గా నిలిచిన అతడు.. లక్నోపై కూడా 52 పరుగులతో నాటౌట్గా నిలవడం విశేషం.
పంత్ పై రివర్స్ కౌంటర్..
అయితే మొదటగా వేలం పాట ముగిసిన తర్వాత.. పంత్, పంజాబ్ కింగ్స్ పై సెటైర్లు వేశాడు. తనకున్న ఒకే ఒక్క టెన్షన్ పంజాబ్ కింగ్స్ అని, ఆ జట్టు తనను ఎక్కడ కొనుగోలు చేస్తుందోనని టెన్షన్ పడినట్లు చెప్పాడు. ఇప్పుడా మాటలనే తిప్పి కొట్టింది పంజాబ్ కింగ్స్. సరైన సమయం కోసం వేచి ఉండి మరీ కౌంటర్ ఇచ్చింది. "మాకున్న టెన్షన్ వేలంలోనే అయిపోయింది" అంటూ బదులిచ్చింది. దీంతో క్రికెట్ అభిమానులంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ పోస్ట్ ను బాగా ట్రోల్ చేస్తున్నారు.