Rishabh Pant VS Shreyas Iyer: ఐపీఎల్ 2025 మెగా వేలంలో రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్ ను దక్కించుకునేందుకు తీవ్ర పోటీ జరిగిన విషయం తెలిసిందే. ఫైనల్ గా లక్నో సూపర్ జెయింట్స్ పంత్ ను రూ.27 కోట్లకు, పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్ ను రూ.26.75 కోట్లకు సొంతం చేసుకున్నాయి. అయితే వీరిద్దరి విషయంలో పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య చర్చనీయాంశంగా మారాయి. 'నాకు కావాల్సింది గొప్ప ప్రదర్శన చేసే ఆటగాడు.. గొప్ప పేరున్న వాడు కాదు'. అంటూ ఆమె చెప్పినట్లు ప్రచారం సాగింది.
ప్రీతి జింటా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. ఆ పోస్టుతో పెద్ద చర్చే మొదలైంది. ప్రీతి జింటా పంత్ ను తక్కువ చేసి మాట్లాడినట్లు ఆ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై ప్రీతి జింటా స్పందించింది. అవన్నీ తప్పుడు వార్తలు అని కొట్టి పారేసింది. తాను ఎవరి గురించి ఏమీ మాట్లాడలేదని స్పష్టం చేసింది. 'నన్ను క్షమించాలి. కానీ ఇదంతా ఫేక్ న్యూస్' అంటూ అని పోస్టు చేసింది.

నెటిజన్ పెట్టిన ఆ పోస్టులో ఏముందంటే
ఓ ఇంటర్వ్యూలో.. 'నేను ఏ జట్టులోకినైనా వెళ్తాను కానీ, పంజాబ్ కింగ్స్కు మాత్రం వెళ్లను.' అని పంత్ అన్నాడు. దీంతో ప్రీతీ జింటా స్పందిస్తూ ''రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్.. జట్టులోకి తీసుకునేందుకు మాకు రెండు ఆప్షన్లు ఉన్నాయి. కానీ, మాకు గొప్ప ప్రదర్శన చేసేవాడు కావాలి కానీ, గొప్ప పేరున్న వాడు కాదు. అందుకే, శ్రేయస్ అయ్యర్ ను తీసుకున్నాం'' అని చెప్పినట్లు పోస్టులో ఉంది.
ఇరు జట్ల ప్రదర్శన..
ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ అదిరే ప్రదర్శన చేస్తూ ముందుకెళ్తోంది. ఆడిన ఏడు మ్యాచుల్లో 5 విజయాలతో రెండో స్థానంలో నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ పడి లేస్తూ ముందుకెళ్తోంది. ఆడిన ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలతో ఐదో స్థానంలో కొనసాగుతోంది.