PBKS VS RR: ఐపీఎల్ 2025లో భాగంగా మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య జరగనుంది. అయితే రాజస్థాన్ జట్టులో అందరి కళ్లు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ పైనే ఉన్నాయి. ఎందుకంటే అతడు జూనియర్ క్రికెట్లో పవర్ ప్యాక్డ్ హిట్టింగ్ చూపించాడు. దీంతో అతడు ఐపీఎల్ లో ఎలాంటి ప్రదర్శన చేస్తాడా అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఈ సీజన్ లో అతడికి ఆడే అవకాశం రాలేదు.
ఈ క్రమంలోనే తాజాగా వైభవ్కు సంబంధించిన ఓ హిలారియస్ వీడియోను షేర్ చేసింది పంజాబ్ కింగ్స్. తమ జట్టు ఆటగాడు ముషీర్ ఖాన్ తో వైభవ్ సూర్యవంశీ కలిసి మైదానంలో సరదాగా మాట్లాడుకున్న ఫన్నీ చాట్ ను పోస్ట్ చేసింది. ఇందులో ముషీర్ ఖాన్.. 'వైభవ బ్యాట్ తీసుకుని ఇది నీ బ్యాటా, నాకు నీ బ్యాట్ ఇస్తావా?' అని సరదాగా అడిగాడు. అయితే దానికి వైభవ్ సరదాగా బదులిచ్చాడు. 'చూశారా ఈ వ్యక్తికి సిగ్గు లేదు. జూనియర్ ప్లేయర్ నుంచి బ్యాట్ అడుగుతున్నాడు. అతడు నాకు గిఫ్ట్ గా ఇవ్వాల్సింది పోయి నన్నే అడుగుతున్నాడు.' అని వైభవ్ సమాధానమిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే వైభవ్, ముషీర్ ఇంకా ఈ ఐపీఎల్ లో మ్యాచ్ బరిలోకి దిగలేదు. వారికి ఇంకా ఆడే అవకాశం రాలేదు.

కాగా, ముషీర్.. దేశవాళీ క్రికెట్ లో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతడు టీమిండియా టెస్ట్ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ చిన్న సోదరుడు. అయితే సర్ఫరాజ్ ఐపీఎల్ 2025 మెగా వేలంలో అన్సోల్డ్గా మిగిలాడు. అతడిని కొనడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. కానీ ముషీర్ ను మాత్రం పీబీకేఎస్ బేస్ ప్రైజ్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఆడిన మూడు మ్యాచుల్లో ఒకటి గెలిచింది. దీంతో పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ ఆడిన రెండు మ్యాచుల్లోనూ గెలిచి టేబుల్ టాపర్ గా కొనసాగుతోంది.