ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. 11 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై గెలిచింది. ఛేదనలో టైటాన్స్ దీటుగానే స్పందించినప్పటికీ.. ఓటమి తప్పలేదు. పంజాబ్ బౌలర్లలో అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు.కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42 బంతుల్లో 5×4, 9×6 పరుగుల సాయంతో 97 నాటౌట్) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మ్యాచ్ అనంతరం తమ విజయానికి గల కారణాన్ని తెలిపాడు శ్రేయస్.
అన్నింటికీ తెగించే వచ్చాం..
"మా తొలి మ్యాచులోనే 97 పరుగులతో నేను నాటౌట్గా నిలవడం మాకు మరింత కలిసొచ్చే అంశం. ఎదుర్కొన్న మొదటి బంతికి బౌండరీ బాదడంతో నాకు మంచి ఊపొచ్చింది. రబాడా బౌలింగ్లో ఫ్లిక్ సిక్సర్ కూడా ప్రత్యేకం. శశాంక్ 16-17 బంతుల్లోనే చేసిన 44 పరుగులు మా జట్టుకు కీలకంగా మారాయి. మేము మా దూకుడు చూపించాల్సిందే అని ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేసుకున్నాం. శశాంక్ అద్భుతంగా రాణించాడు. ఇక వైశాక్ చాలా సరదా స్వభావం ఉన్న వ్యక్తి. ఎప్పుడూ స్పష్టమైన ఆలోచనతో మైదానంలోకి వస్తాడు. ప్రారంభం నుంచే యార్కర్లు వేయడం మొదలుపెట్టాడు. ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా, బ్యాలెన్స్డ్గా ఆడాడు."

అతడిడే కీలక పాత్ర..
"అర్ష్దీప్ మా వైడ్ యార్కర్ ప్రణాళికలో ముఖ్య పాత్ర పోషించాడు. అతడు వచ్చి బంతి కాస్త రివర్స్ స్వింగ్ అవుతోందని చెప్పాడు. కాబట్టి బంతిపై లాలాజలం ఉండటం బౌలర్లకు కొంత సాయపడుతోందని భావిస్తున్నాను. అతడు సాయిని ఔట్ చేయడంతో మ్యాచ్ మలుపు తిప్పినట్టైంది. ఆ తర్వాత అతడు వచ్చి వైడ్ యార్కర్లను ఆలస్యంగా ప్రయత్నించకుండా ముందుగానే ప్రారంభిద్దాం అని అన్నాడు."
"సీజన్ ప్రారంభానికి ముందే మేము అన్ని విధాలుగా సిద్ధమయ్యాం. మేమందరం ముందుగానే మా ప్లాన్స్ ను మాట్లాడుకుని, మైదానంలో వాటిని ఎలా అమలు చేయాలనే దానిపై చర్చించాం. నేను ఒక్కడినే కాదు, అందరూ చురుగ్గా తమ ప్రణాళికలను గురించి మాట్లాడారు. ఇక ఇప్పుడు ఈ జోరును మిగతా మ్యాచ్ల్లోనూ కొనసాగించాలనుకుంటున్నాం."
ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది. శ్రేయస్తో పాటు ప్రియాంశ్ ఆర్య ( 23 బంతుల్లో 7×4, 2×6 పరుగుల సాయంతో 47 పరుగులు), శశాంక్ సింగ్ (16 బంతుల్లో 6×4, 2×6 సాయంతో 44 నాటౌట్; ) రాణించారు. ఛేదనలో గుజరాత్ టైటాన్స్ 5 వికెట్లు కోల్పోయి 232 పరుగులే చేసింది. సాయి సుదర్శన్ ( 41 బంతుల్లో 74; 5×4, 6×6), బట్లర్ ( 33 బంతుల్లో 54; 4×4, 2×6), షెఫానీ రూథర్ఫర్డ్ (28 బంతుల్లో 46; 4×4, 3×6) మెరుపులు వృథా అయ్యాయి.