RCB VS PBKS: ఐపీఎల్ 2025లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తోన్న ఆటగాడు ఎవరంటే గ్లెన్ మ్యాక్స్వెల్. ఈ పంజాబ్ కింగ్స్ ఆల్ రౌండర్ తన స్థాయికి తగ్గట్టు ఏ మాత్రం ప్రదర్శన చేయట్లేదు. తనను కొనుగోలు చేసిన ధరకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోతున్నాడు. భారీ అంచనాలతో ఈ సీజన్ బరిలోకి దిగిన అతడు తుస్సుమనిపించాడు. ఈ సీజన్ లో ఇప్పటివరకు అతడికి 6 మ్యాచులలో ఐదు సార్లు ఆడే అవకాశం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 6 మ్యాచ్లలో 8.2 సగటుతో కేవలం 41 పరుగులు మాత్రమే చేశాడు. అది కూడా 100 స్ట్రైక్ రేట్ తోనే.
Glenn Maxwell: ఇప్పటివరకు గ్లెన్ మ్యాక్స్వెల్ ఆడిన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి. అతడి అత్యధిక స్కోరు 30 పరుగులు మాత్రమే ఉండటం గమనార్హం. అంటే ఈ లెక్కన మిగిలిన 4 ఇన్నింగ్స్ లలో కలిపి అతడు కేవలం 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. బౌలింగ్ లో నాలుగు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో క్రికెట్ అభిమానులు, పలువురు మాజీలు అతడిపై విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అతడిపై మాజీ ఇండియన్ క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా కూడా విమర్శలు చేశాడు. మ్యాక్సీ నిద్రలేవాల్సిన సమయం వచ్చిందని అన్నాడు. మ్యాక్సీ కాకుండా ఇతర ప్లేయర్ ఇలా ఆడి ఉంటే, ఈ పాటికే అతడిని జట్టు నుంచి తప్పించేవారని పేర్కొన్నాడు.

నిద్ర లే మ్యాక్సీ..
"అతడి బ్యాటింగ్ విధానం అంతగా మారలేదు. కొన్ని సందర్భాల్లో అతడు కాస్త నిర్లక్ష్యంగా కూడా కనిపించాడు. ఎనిమిది-పది ఏళ్ల క్రితం ఎలా ఉన్నాడో అలానే ఇప్పుడు కూడా ఉన్నాడు.
ఓ జట్టులో స్థానం దక్కినప్పుడు, సదరు ఫ్రాంచైజీ కోసం ఆడే అవకాశం దొరికినప్పుడు, అక్కడ మనవంతుగా ఉత్తమంగా ఆడేందుకు ప్రయత్నించాలని ఆటగాళ్లు గుర్తించాలి. కొన్ని సందర్భాల్లో ఆటగాళ్లు నిర్లక్ష్యంగా తయారవుతారు. తమ ప్రదర్శనపై పెద్దగా శ్రద్ధ చూపించరు.
"అతడు మంచి ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని నేను నమ్ముతున్నాను. కానీ విఫలమవుతున్నప్పుడు.. కాస్త నిర్లక్ష్యత కూడా ఆవహిస్తుంది. దాన్ని తప్పించి, మరింత బాధ్యతతో ఆడాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి మరో ఆటగాడు ఇలాంటి ప్రదర్శన చేసి ఉంటే.. జట్టులో స్థానం కోల్పోయేవాడే. కానీ మ్యాక్స్వెల్ కాబట్టి, అతడికి ఇంకా అవకాశం దక్కుతోంది," అని పూజారా చెప్పుకొచ్చాడు.
గత సీజన్లోనూ ఇంతే..
గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ 2024లోనూ చెత్త ప్రదర్శనే చేశాడు. ఆర్సీబీ రూ.11 కోట్లకు కొనుగోలు చేస్తే.. అప్పుడతడు 10 మ్యాచ్ల్లో కేవలం 52 పరుగులు మాత్రమే చేశాడు. అంతకుముందు 2020 సీజన్ లో 13 మ్యాచ్ల్లో 108 పరుగులు, 2018లో 12 మ్యాచ్ల్లో 169 పరుగులు, 2016లో మ్యాచ్ల్లో 179 పరుగులు, 2015లో 11 మ్యాచ్ల్లో 145 పరుగులు మాత్రమే చేశాడు. మొత్తంగా ఐపీఎల్ కెరీర్ లో ఇప్పటివరకు 24 సగటుతో 2812 పరుగులు చేయగలిగాడు. లీగ్లో అత్యధికంగా డకౌట్ అయిన ఆటగాడు కూటా అతడే. కాగా, 2012లో ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన అతడు.. ఢిల్లీ, ముంబై ఇండియన్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఆర్సీబీ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. మొత్తం ఈ లీగ్ ద్వారా ఇప్పటివరకు జీతంగా రూ.100 కోట్ల 64 లక్షలు సంపాదించాడు. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ జట్టుకు తిరిగి వచ్చాడు. పంజాబ్ జట్టు ఈ సారి రూ.4.2 కోట్లకు కొనుగోలు చేసింది.