IPL 2025 Opening Ceremony : ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి వేళైంది. మార్చి 22న ఓపెనింగ్ సెర్మనీతో ఈ ఎడిషన్ ప్రారంభం కానుంది. అయితే ఈ సారి మరో కొత్త సంప్రదాయానికి తెర తీయనున్నారు. ఐపీఎల్ క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా సరికొత్త విధంగా ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించేందుకు సిద్ధమ్యయారు. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఐపీఎల్ 2025 ఓపెనింగ్ మ్యాచ్ కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరగనుంది. కోల్కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తొలి మ్యాచ్ లో తలపడనున్నారు. అయితే ప్రతీ సీజన్ లోనూ తొలి మ్యాచ్ రోజు ప్రారంభోత్సవ వేడుకను ఘనంగా జరపడం ఆనవాయితీగా వస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ ఓపెనింగ్ సెర్మనీలో పలువురు బాలీవుడ్ స్టార్స్ తో ఆటపాటలు, డ్యాన్సులు ఇతర హంగామా కూడా ఉంటుంది. అలా ఈ సారి షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, దిశా పటానీ, శ్రద్ధా కపూర్, శ్రేయా ఘోషల్ సహా పలువురు హాజరై సందడి చేయనున్నారు.

ఈ సారి ఏకంగా...
అయితే ఎప్పుడూ ఈ ప్రారంభోత్సవ వేడుకలను ఓపెనింగ్ మ్యాచ్ గ్రౌండ్ లోనే నిర్వహిస్తారు. కానీ ఈ సారి మాత్రం.. ఏకంగా 13 వేదికల్లో నిర్వహించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేయనుండటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ఇలా జరగడం. ఐపీఎల్ 2025 వేదికలైనా కోల్కతా, హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, గౌహతి, అహ్మదాబాద్, లక్నో, ముంబై, చండీగఢ్, బెంగళూరు, ఢిల్లీ, జైపూర్, ధర్మశాల.. ఇలా 13 వేదికల్లో మ్యాచ్లు జరగనుండగా.. ఓపెనింగ్ సెర్మనీని అన్ని వేదికల్లో నిర్వహిస్తున్నారు. దీనికి రాష్ట్ర సంఘాలు కూడా సహకరించనున్నట్లు తెలిసింది. అంతకుముందు ఐపీఎల్ 2017లో 8 జట్లు పాల్గొనగా.. ఆ 8 జట్లకు సంబంధించిన హోం గ్రౌండ్ లో ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించారు.