రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కప్ కల మరోసారి చెదిరింది. 17 ఏళ్ల నిరీక్షణ కొనసాగుతోంది. ఐపీఎల్-2024 సీజన్ను కూడా టైటిల్ సాధించకుండానే ఆర్సీబీ ముగించింది. ఆర్సీబీ ఉమెన్స్ జట్టు తరహాలో ఈ ఏడాది మెన్స్ జట్టు కూడా ట్రోఫీని ముద్దాడుతుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే ఈ సీజన్లో ఆర్సీబీకి కొన్ని సానుకూలాంశాలు కనిపించాయి.
ఈ సీజన్ ప్రారంభంలో తొలి ఎనిమిది మ్యాచ్ల్లో ఆర్సీబీ కేవలం ఒకే విజయం సాధించింది. ఆ స్థితిలో బెంగళూరు ప్లేఆఫ్స్కు చేరుతుందని దాదాపు ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆ తర్వాత డుప్లెసిస్ సేన గొప్పగా పుంజుకుంది. వరుసగా ఆరు విజయాలు సాధించింది. డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ను సైతం మట్టికరిపించి ప్లేఆఫ్స్కు చేరింది. కానీ ఎలిమినేటర్లో అదే జోరు ప్రదర్శించలేకపోయింది. కీలక మ్యాచ్లో తడబడింది.

రిటైన్ చేసుకునే ఆటగాళ్లు మరో మూడేళ్ల పాటు జట్టుతో కొనసాగాల్సి ఉంటుంది. అయితే డుప్లెసిస్ ప్రస్తుత వయస్సు 39 ఏళ్లు. ఈ స్థితిలో కెప్టెన్ను కొనసాగిస్తే భవిష్యత్ ప్రణాళికలకు ఆటంకం కలిగే పరిస్థితులు ఎదురవుతాయి. దీంతో డుప్లెసిస్ను మెగా వేలానికి విడిచిపెట్టాలని మేనేజ్మెంట్ భావిస్తోంది. అయితే నయా కెప్టెన్ ఎవరని తేలకపోతే డుప్లెసిస్ను రైట్ టూ మ్యాచ్ కార్డ్ ద్వారా తిరిగి దక్కించుకోవాలని ఆర్సీబీ ప్లాన్ చేస్తోంది.
మరోవైపు గ్లెన్ మాక్స్వెల్ను కూడా విడిచిపెట్టాలని ఆర్సీబీ భావిస్తోంది. ఆర్టీఎమ్కు మరో అదనపు అవకాశం కల్పిస్తే తిరిగి మాక్సీని పొందాలని అనుకుంటుంది. అయితే ఆర్టీఎమ్ ద్వారా డుప్లెసిస్ స్థానంలో మాక్సీకే అధిక ప్రాధాన్యత ఇచ్చే యోచనలోనూ ఉంది. చిన్నస్వామి స్టేడియంలో ఈ భారీ హిట్టర్ ఆర్సీబీకి అదనపు బలంగా మారతాడు. ఇక నయా ఆల్రౌండర్ విల్ జాక్స్ను రిటైన్ చేసుకోనుంది. ఈ సీజన్లో జాక్స్ మెరుపు సెంచరీతో పాటు కీలక ఇన్నింగ్స్లు ఆడాడు.
అలాగే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, యువ ప్లేయర్లు రజత్ పటిదార్, మహ్మద్ సిరాజ్ను జట్టులో ఆర్సీబీ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది. ప్లేఆఫ్స్ చేరడంలో ఈ ఆటగాళ్లు ప్రధాన పాత్ర వహించారు. రజత్ ఈ సీజన్ సెకండాఫ్లో అర్ధశతకాలతో హోరెత్తించాడు. స్పిన్లో విధ్వంసం సృష్టించి మ్యాచ్లను మలుపు తిప్పాడు.
ఆర్సీబీ రిటైన్ లిస్ట్ (అంచనా)
విరాట్ కోహ్లి, విల్ జాక్స్, రజత్ పటిదార్, మహ్మద్ సిరాజ్