IPL 2025: ఐపీఎల్ 18వ షెడ్యూల్ ప్రకటించబడింది. కొన్ని ఫ్రాంచైజీలు రాబోయే సీజన్ కోసం తమ వ్యూహాన్ని రూపొందించడం ప్రారంభించాయి. ఇదిలా ఉండగా.. శుక్రవారం నాడు ఐపీఎల్ 2025 కోసం ముంబై ఇండియన్స్ తమ కొత్త జెర్సీని విడుదల చేసింది. దీంతో పాటు కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిమానులకు, జట్టు సభ్యులకు తన భావోద్వేగ సందేశాన్ని కూడా ఇచ్చాడు. పాండ్యా, కోర్ ప్లేయర్లు రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలకవర్మలతో కలిసి ఫ్రాంచైజీ అద్భుతమైన వారసత్వాన్ని కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు. హార్దిక్ పాండ్యా మాట్లాడుతూ.. 2025లో ముంబై ఇండియన్స్ సత్తా చాటుతుందన్నాడు. ముంబై ఇండియన్స్ వారసత్వాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే అవకాశం వచ్చిందని అన్నాడు. నీలం, బంగారు రంగులతో ఈ జట్టు గర్వంగా ఉండాలని ఆశిస్తున్నామన్నారు. ఇది కేవలం జెర్సీ మాత్రమే కాదని.. ఇది మేము ఇచ్చిన వాగ్దానమంటూ హార్దిక్ సందేశం ఇచ్చాడు.
ఆకర్షణీయంగా కొత్త జెర్సీ
ముంబై ఇండియన్స్ కొత్త జెర్సీ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఎప్పటిలాగే ముంబై ఇండియన్స్ జెర్సీలో నీలం, బంగారు రంగులను నిలుపుకుంది. నీలం రంగు జట్టు నమ్మకం, ఆత్మవిశ్వాసం, అపారమైన సామర్థ్యాన్ని సూచిస్తుంది. బంగారు రంగు గర్వం, విజయం, శ్రేష్ఠతను సూచిస్తుంది. జెర్సీ ఛాతీకి కుడి వైపున స్పాన్సర్ లోగో కనిపిస్తుంది. ముంబై ఇండియన్స్ లోగో ఎడమ వైపున కనిపిస్తుంది. ఐపీఎల్ 2025 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ 5 మంది ఆటగాళ్లను నిలుపుకుంది. ఇందులో జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్, తిలక్ వర్మ పేర్లు ఉన్నాయి. గత ఏడాది నవంబర్ లో జెడ్డాలో జరిగిన రెండు రోజుల మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 18 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసి తన జట్టులో చేర్చుకుంది.

ముంబై ఇండియన్స్ మొదటి మ్యాచ్ ఈ జట్టుతోనే..
ఐపీఎల్ 18వ సీజన్ మార్చి 22 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది. ఈ రెండు జట్లు మార్చి 23న సీఎస్కే సొంత మైదానం చెపాక్ స్టేడియంలో తలపడతాయి.