ఐపీఎల్ మెగా వేలానికి ముహుర్తం ఖరారైంది. సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా నవంబర్ 24, 25వ తేదీల్లో మెగా ఆక్షన్ను నిర్వహించనున్నట్లు బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. విదేశాల్లో ఐపీఎల్ వేలాన్ని నిర్వహించడం వరుసగా ఇది రెండోసారి. వేలానికి 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఇందులో 1165 మంది భారత క్రికెటర్లు ఉండగా, 409 మంది విదేశీ ప్లేయర్లు ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు మెగా వేలంలో ఏఏ ఆటగాళ్లను సొంతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అయితే ముంబై ఇండియన్స్ ముగ్గరు ప్లేయర్లపై కన్నేసింది. వాళ్ల కోసం రూ. కోట్లు కుమ్మరించడానికి కూడా సిద్ధమైంది. ముంబై అయిదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య, రోహిత్ శర్మ, తిలక్ వర్మలను అట్టిపెట్టుకుంది. ఈ ఆటగాళ్ల కోసం రూ. 75 కోట్లు ఖర్చుపెట్టింది. దీంతో వేలంలో రూ.45 కోట్లతో బరిలోకి దిగుతోంది.

ఈ మొత్తంతో నిబంధనల ప్రకారం ముంబై ఇండియన్స్ గరిష్టంగా 20 మందిని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. అందులో అత్యధికంగా 8 మంది విదేశీ ప్లేయర్లకే ఛాన్స్. ఇక తమ మాజీ అన్క్యాప్డ్ ప్లేయర్ను ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా సొంతం చేసుకునే అవకాశం ఉంది. అయితే ముంబై ఇండియన్స్ ప్రధానంగా మూడు విభాగాల్లో కీలక ప్లేయర్ను వేలంలో దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తోంది. ప్రధాన స్పిన్నర్, వికెట్ కీపర్, స్పిన్ ఆల్రౌండర్, ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తోంది.
స్పిన్ ఆల్రౌండర్గా వాషింగ్టన్ సుందర్, స్పిన్నర్గా యుజువేంద్ర చాహల్, లెఫ్టార్మ్ పేసర్గా నటరాజన్, వికెట్ కీపర్గా ఫిలిప్ సాల్ట్ను దక్కించుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. చాహల్తో పాటు సుందర్ స్పిన్, బుమ్రాతో పాటు నటరాజన్ డెత్ ఓవర్లు వేయించాలని, ఇక ఫిలిప్ సాల్ట్ కీపింగ్ బాధ్యతలో పాటు రోహిత్తో కలిసి ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయించాలని ముంబై యోచిస్తోంది. వ్యూహాత్మకంగా ముంబై ఆర్టీఎమ్ ఉపయోగించలేని ఫ్రాంచైజీల మాజీ ప్లేయర్లపై గురిపెడుతోంది.
ఎస్ఆర్హెచ్కు ఓ ఆర్టీఎమ్ ఉన్నప్పటికీ అది అన్క్యాప్డ్ ప్లేయర్కు మాత్రమే. నటరాజన్, సుందర్లపై ఉపయోగించలేదు. ఇక కేకేఆర్, రాజస్థాన్ రాయల్స్ ఆరుగురిని రిటైన్ చేసుకోవడంతో సాల్ట్, చాహల్ కోసం వాళ్ల ఆర్టీఎమ్తో పోటీకి రాలేరు. దీంతో బిడ్ను కంట్రోల్ చేయవచ్చని ముంబై భావిస్తోంది.