Mumbai Indians Playing 11 VS RCB: దాదాపు నాలుగు నెలల నుంచి ఆటకు దూరంగా ఉంటోన్న బుమ్రా.. ముంబయి జట్టుతో కలిసేందుకు సిద్ధమైపోయాడు. దీంతో ఐపీఎల్ 2025లో వరుస ఓటములతో సతమతమవుతోన్న ముంబయి ఇండియన్స్ స్క్వాడ్లో బలం పెరిగింది. క్రికెట్ అభిమానుల్లో మరింత జోష్ పెరిగింది. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనున్న ముంబయి ఇండియన్స్ తుది జట్టు అంచనా వివరాలు చక్కర్లు కొట్టడం ప్రారంభించేశాయి. మాజీలు, క్రికెట్ అభిమానులు ముంబయి తుది జట్టును అంచనా వేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 7న వాంఖెడె స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరగనున్న మ్యాచులో ముంబయి ఇండియన్స్ తుది జట్టు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం..
ముంబయి ఇండియన్స్ తన తొలి రెండు మ్యాచుల్లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్పై పరాజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కోల్కతా నైట్ రైడర్స్పై గెలిచి కాస్త విజయ బాటలోకి వచ్చిందనుకుంటే ఆ వెంటనే లక్నో సపర్ జెయింట్స్పై మళ్లీ ఓడింది. దీంతో ప్రస్తుతానికి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్కు చేరుకోవాలంటే మిగతా 10 మ్యాచుల్లో కనీసం 8 విజయాలు సాధించాలి. కాబట్టి ఇప్పుడు ముంబయి మళ్లీ ట్రాక్లోకి రావాలంటే, విజయాలు అవసరం. అలానే జట్టులో కొత్త ఉత్సాహం కూడా అంతే అవసరం. ఈ నేపథ్యంలో ఆర్సీబీతో జరగబోయే బిగ్ ఫైట్ ముందు జట్టులోకి బుమ్రా రావడం ఇప్పుడు కీలక విషయం. మరి బుమ్రా రాకతో ఎవరిపై వేటు వేస్తారో. పైగా లక్నోతో మ్యాచుకు గాయంతో దూరమైన రోహిత్ శర్మ కూడా.. ఇప్పుడు ఆర్సీబీతో మ్యాచుకు సిద్ధమయ్యాడని తెలిసింది. కానీ ఇది కాస్త డౌటే.

కాంబినేషన్ ఇదే
ఒకవేళ రోహిత్ అందుబాటులోకి వస్తే.. అతడితో కలిసి రియాన్ రికెల్టన్ ఓపెనింగ్ చేస్తాడు. విల్ జాక్స్ ఇంపాక్ట్ ప్లేయర్ గా వస్తాడు. సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో రాగా, తిలక్ వర్మ, నమన్ ధిర్, హార్దిక్ పాండ్య తర్వాతి స్థానాల్లో దిగుతారు. దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రిత్ బుమ్రా, విఘ్నేశ్ పుత్తూర్, మిచెల్ శాంట్నర్ బౌలింగ్ చూసుకుంటారు.
ఆందోళన కలిగించే విషయం అదే...
ముంబయి పేస్ బౌలింగ్ను కెప్టెన్ హార్దిక్ పాండ్యతో పాటు బౌల్ట్, దీపక్ చాహర్ నడిపిస్తున్నారు. కానీ, వీరిలో దీపక్ మాత్రం పెద్దగా ప్రభావం చూపించడంలేదు. స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. అదే బుమ్రా జట్టులో ఉండుంటే పవర్ప్లేతో పాటు డెత్ ఓవర్లలో వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని దెబ్బ కొట్టేవాడు. అయితే ఇప్పుడు ఎట్టకేలకు బుమ్రా తిరిగి రావడంతో బౌలింగ్ విభాగం మరింత బలంగా తయారైంది. కానీ ముంబయి బ్యాటింగ్ విభాగం మాత్రం కాస్త ఆందోళన కలిగించేలానే ఉంది. రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్య బ్యాటుకు ఇంకా సరైన పని చెప్పలేదు. కాబట్టి ముంబయి విజయం సాధించాలంటే బ్యాటర్లు తమ బ్యాటును ఝళిపించాల్సిన అవసరం ఉంది. కాగా, బుమ్రా కచ్చితంగా ఆర్సీబీతో జరగబోయే మ్యాచులో ఆడతాడనేది చెప్పలేం. ఒకవేళ అతడు ఈ మ్యాచ్ బరిలోకి దిగకబోతే.. వాంఖడే వేదికగానే ఏప్రిల్ 17న సన్రైజర్స్తో జరిగే మ్యాచులో ఆడొచ్చు.
ఆర్సీబీతో మ్యాచ్.. ముంబయి తుది జట్టు అంచనా
రోహిత్ శర్మ, రియాన్ రికెల్టన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, నమన్ ధీర్, హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్, మిచెల్ శాంట్నర్, విఘ్నేష్ పుత్తూర్, విల్ జాక్స్ (ఇంపాక్ట్).