IPL 2025: ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ గొప్ప ఆరంభాన్ని పొందలేదు. కానీ తర్వాత హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై జట్టు అద్భుతమైన పునరాగమనం చేసి పాయింట్ల పట్టికలో టాప్-2లో నిలిచాడు. ఆ సమయంలోనే భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్ 2025ను వాయిదా వేసింది. కానీ ఇప్పుడు ఐపీఎల్ టోర్నమెంట్ మే 17 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ఐపీఎల్ 2025 సీజన్ మళ్లీ ప్రారంభమవుతున్న తరుణంలో ముంబై జట్టులో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇంగ్లాండ్ కీలక ఆటగాడు విల్ జాక్స్ ఐపీఎల్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ సిరీస్ కోసం విల్ జాక్స్ ఇంగ్లాండ్ జాతీయ జట్టుకు ఎంపిక కావడంతో మిగిలిన మ్యాచ్లకు అతను అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
ఈ క్రమంలో తక్షణ చర్యగా మరో ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్స్టోను జట్టులోకి తీసుకోవాలని ముంబై ఇండియన్స్ భావిస్తోంది. ఈ సారి మెగా వేలంలో జానీ బెయిర్స్టో అమ్ముడుపోలేదు. ఈ ఆటగాడిపై ఏ జట్టు కూడా నమ్మకం చూపలేదు. ఇప్పుడు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జానీ బెయిర్స్టోకు ఎన్వోసీ ఇస్తే ఈ ఆటగాడు ముంబై ఇండియన్స్లో చేరవచ్చు. ఈసీబీ నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తే నాకౌట్ దశలో బెయిర్ స్టో జట్టులో చేరే అవకాశం ఉంది. మరోవైపు ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ కూడా ప్లేఆఫ్స్కు దూరమవుతాడని ప్రచారం జరుగుతోంది. దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్స్ ఆడే క్రమంలో రికెల్టన్ ఐపీఎల్ ప్లేఆఫ్స్కు దూరమయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితిలో ముంబై జట్టు మరో ప్రత్యామ్నాయాన్ని ఆలోచిస్తోంది. ఈ క్రమంలో శ్రీలంక బ్యాటర్ చరిత్ అసలంకాతో సంప్రదింపులు జరిపినట్లు తెలిసిందే. అసలంక పేరును ప్రస్తుతం పరిశీలిస్తున్నారు.

జానీ బెయిర్స్టో గతంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్లో పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడాడు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. దీంతో ప్లేఆఫ్స్లో ఓపెనర్గా రోహిత్ శర్మకు జోడీగా బెయిర్స్టో మంచి ఆప్షన్ అవుతాడని ముంబై ఇండియన్స్ యాజమాన్యం ఆలోచిస్తోంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పాయింట్ల పట్టికలో ముంబై ఇండియన్స్ స్థానం
ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడగా.. అందులో ఆ జట్టు 7 గెలిచి 5 మ్యాచ్ల్లో పరాజయం పాలైంది. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ 14 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాల్గవ స్థానంలో ఉంది. ముంబై జట్టుకు ప్రస్తుతం 2 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. అందులో ఒక మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ జట్టుతో, మరొకటి పంజాబ్ కింగ్స్తో జరగనుంది. ఈ రెండు మ్యాచ్ల్లో విజయం సాధించడం ద్వారా ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాలని కోరుకుంటోంది.