IPL 2025: ఐపీఎల్ 2025లో వరుస ఓటములతో చతికిలపడిన చెన్నై సూపర్ కింగ్స్.. నేడు కోల్కతా నైట్ రైడర్స్ జట్టుతో తలపడనుంది. సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కావడంతో ఈ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ క్రమంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మరోసారి సారథిగా వ్యవహరించనున్నాడు. కేకేఆర్ తో జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో సీఎస్కే ఆటగాళ్లు ప్రాక్టీస్ లో తలమునకలయ్యారు. కెప్టెన్ ధోని కూడా నెట్స్ లో బ్యాటింగ్ చేస్తూ తీవ్రంగా శ్రమించాడు. ఆ సమయంలోని కోల్కతా జట్టు మెంటార్ డ్వేన్ బ్రావో మైదానంలోకి వచ్చి సీఎస్కే ఆటగాళ్లను పలకరించాడు. ఈ క్రమంలో సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా బ్రావోకు ఎదురుగా వెళ్లి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు.
ఆ సమయంలోనే నెట్స్ లో ప్రాక్టీస్ చేసుకున్న ధోని బ్రావోను చూసి.. "ఇదిగో ద్రోహి వచ్చేశాడు చూడండి" అంటూ ధోని తనదైన స్టైల్ లో బ్రావోకు స్వాగతం పలికాడు. బ్రావో సీఎస్కే జట్టు నుంచి కోల్కతాకు వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ.. ధోని బ్రావోను వ్యంగ్యంగా ధ్రోహి అంటూ సరదాగా పిలిచాడు. ఈ క్రమంలోనే బ్రావో మాట్లాడుతూ.."జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు.. చాలా చిత్రమైనది" అంటూ డ్వేన్ బ్రావో బదులిచ్చాడు. అనంతరం బ్రావో నవ్వుతూ వెళ్లి సీఎస్కే కెప్టెన్ ధోనిని హగ్ చేసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను సీఎస్కే సోషల్ మీడియాలో షేర్ చేయగా.. వైరల్ గా మారింది. 'ఎంఎస్-డీజే-వైబ్ను మిస్సవుతున్నాం' అంటూ సీఎస్కే క్యాప్షన్ ను జతచేసింది. ఈ వీడియోను చూసి ఫ్యాన్స్ భావోద్వేగానికి గురవ్వడంతో పాటు.. బ్రావో సీఎస్కే ఫ్రాంచైజీని వీడి వెళ్తాడని అస్సలు ఊహించలేదంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

సీఎస్కే జట్టు నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా డ్వేన్ బ్రావో బౌలింగ్ కోచ్ గా జట్టుతో కొనసాగాడు. అనంతరం కోల్కతా జట్టు తనను పిలిచిందని చెప్పి బ్రావో సీఎస్కే జట్టుకు రాజీనామా చేసి కోల్కతా జట్టు బౌలింగ్ కోచ్ గా చేరాడు. ఇది సీఎస్కే అభిమానులను షాక్ కు గురిచేసింది. సీఎస్కే జట్టుకు మూల స్తంభాల్లో ఒకరైన బ్రావో ఎందుకు వెళ్లిపోయాడనే దానిపై అనేక ప్రశ్నలు తలెత్తాయి.