IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా శనివారం చెపాక్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ జరుగుతుండగా.. సీఎస్కే స్టార్ మహేంద్ర సింగ్ ధోని రిటైర్ అవ్వబోతున్నారా? ఈ రోజు ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్ ధోని ఐపీఎల్ కెరీర్లో చివరి మ్యాచ్ కావచ్చా? అనే ఊహాగానాలు వస్తున్నాయి. దానికి కారణం కూడా ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సందర్భంగా మహేంద్ర సింగ్ ధోని తల్లిదండ్రులు స్టేడియంలో ఉండటం ఎంఎస్ ధోని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలకు ఆజ్యం పోసింది. ఎప్పుడూ పెద్దగా బయట కనిపించని ఎంఎస్ ధోని తల్లిదండ్రులు మ్యాచ్ వీక్షించేందుకు రావడంతో అభిమానులు తమ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ధోని తల్లిదండ్రులు మ్యాచ్ వీక్షించే దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ధోని తండ్రి పేరు పాన్ సింగ్ కాగా.. తల్లి పేరు దేవకీ దేవి.
స్టేడియంలో మొదటిసారి ధోని తల్లిదండ్రులు?
మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షి, కుమార్తె జీవా తరచుగా స్టేడియంలో కనిపిస్తారు. కానీ వారి తల్లిదండ్రుల విషయంలో అలా కాదు. ఈ కారణంగానే ధోని తల్లిదండ్రులు స్టేడియానికి చేరుకున్నప్పుడు అభిమానులు ధోని రిటైర్మెంట్ గురించి ఊహాగానాలు ప్రారంభించారు. ఈ సీజన్ లో ఎంఎస్ ధోని 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాడు. ధోని 10 ఓవర్లు బ్యాటింగ్ చేయలేడని, అందుకే అతను 9వ స్థానంలో బ్యాటింగ్ కు దిగుతాడని సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ అన్నారు.

ఎంఎస్ ధోని ఐపీఎల్ కెరీర్
2008లో అరంగేట్రం చేసిన మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్లో 267 మ్యాచ్లు ఆడాడు. ఎంఎస్ ధోని 232 ఇన్నింగ్స్లలో 5,289 పరుగులు చేశాడు. ఎంఎస్ ధోని సగటు 39.18కాగా.. స్టైక్ రేట్ 137.70గా ఉంది. వీటిలో 237 మ్యాచ్ లు సీఎస్కే తరఫున ఆడాడు. ఇందులో ఎంఎస్ ధోని 4,715 పరుగులు చేశాడు. సీఎస్కే తరఫున ధోని సగటు 40.30 కాగా.. స్టైక్ రేట్ 139.46. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో చెన్నై తొలి సీజన్ లోనే ఫైనల్స్ కు చేరుకుంది. ఆ జట్టు 2010లో తొలిసారి ఛాంపియన్ గా నిలిచింది. రోహిత్ శర్మతో పాటు ధోని కూడా ఐపీఎల్ అత్యధిక ట్రోఫీలు(5) గెలిచిన కెప్టెన్ గా నిలిచాడు.