రిటైన్ ప్లేయర్ల లిస్ట్ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు మరికొన్ని గంటలు మాత్రమే గడువు ఉంది. గురువారం లోపు తమ రిటెన్షన్ లిస్ట్ను సమర్పించాల్సి ఉంది. ఈ క్రమంలో ఫ్రాంచైజీలు దాదాపుగా తమ రిటైన్ లిస్ట్ను ఖరారు చేశాయి. అయితే రిషభ్ పంత్ను ఢిల్లీ క్యాపిటల్స్ వదులుకోవాలని నిర్ణయించుకుందని తెలియడంతో చెన్నై సూపర్ కింగ్స్ తమ రిటైన్ లిస్ట్ను మార్చడానికి సిద్ధమైంది.
తొలుత ఖరారు చేసిన రిటైన్ లిస్ట్ను మార్చనుంది. పంత్ గురించి అప్డేట్ రాకముందు.. సీఎస్కే అయిదుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ జాబితాలో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, శివమ్ దూబె, మతీషా పతిరానా ఉన్నారు. అన్క్యాప్డ్ ప్లేయర్గా ఎంఎస్ ధోనీ కొనసాగనున్నాడు.

పంత్ వేలంలోకి వస్తున్నాడని తెలియడంతో వికెట్ కీపర్-కెప్టెన్గా పంత్ను తన వారసుడిగా సీఎస్కేలోకి తీసుకురావాలని ధోనీ వ్యూహాలు రచిస్తున్నాడు. అయితే పంత్ కోసం కనీసం రూ.20 కోట్లు పైగా అవసరమవుతాయి. ఈ క్రమంలో 2018లో అవలంబించిన వ్యూహలను మరోసారి అమలు చేయాలని సీఎస్కే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. పర్స్ వ్యాల్యూలో ఎక్కువ మొత్తాన్ని ఉంచుకొని ఆర్టీఎమ్తో తమ ప్లేయర్లను సొంతం చేసుకోవాలనుకుంటున్నాయి.
2018లో డుప్లెసిస్, డ్వేన్ బ్రావోను విడుదల చేసి వేలంలో సీఎస్కే ఆర్టీఎమ్తో దక్కించుకుంది. అదే వ్యూహాన్ని ఈసారి అమలు చేయనుంది. ఈ క్రమంలో శివమ్ దూబెతో పాటు రవీంద్ర జడేజాను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే టీ20 వరల్డ్ కప్ అనంతరం టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన జడేజా సీఎస్కేకే విధేయుడు. జడ్డూను రిటెన్షన్ లిస్ట్లో నుంచి తొలగించడం సీఎస్కేకే కఠిన నిర్ణయమే. కానీ పర్స్ వ్యాల్యూను పెంచుకోవడం కోసం జడేజాను రిలీజ్ చేయడానికి సీఎస్కే సిద్ధమైంది.
కేవలం ముగ్గురు ప్లేయర్లతోనే రిటైన్ లిస్ట్ను ప్రకటించాలని సీఎస్కే భావిస్తోంది. రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరానాలతో పాటు ఎంఎస్ ధోనీని మాత్రమే అట్టిపెట్టుకోవాలని యోచిస్తోంది. ఈ సందర్భంలో సీఎస్కే కనీసం రూ.84 కోట్లతో వేలంలో పాల్గొంటుంది.