మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ మెగా ఆక్షన్కు సంబంధించిన నియమ నిబంధనలు ఈ నెల ఆఖర్లో దాదాపు ఖరారు కానున్నాయి. రిటైన్డ్ ప్లేయర్లు జాబితా పరిమితి, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్స్, రైట్ టూ మ్యాచ్ కార్డ్, శాలరీ క్యాప్, ఫ్రాంచైజీల పర్స్ వ్యాల్యూ వంటి విషయాలన్నింటిపై స్పష్టత రానుంది.
అయితే దిగ్గజ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ కోసం చెన్నై సూపర్ కింగ్స్ డిమాండ్ చేసిన రూల్ను అమలు చేస్తారా లేదా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రూల్ను సన్రైజర్స్ హైదరాబాద్తో సహా కొన్ని ఫ్రాంచైజీలు వ్యతిరేకించాయి. కాగా, ఆ నిబంధనను బీసీసీఐ అంగీకరిస్తే ధోనీ రూ.8 కోట్లు నష్టపోతాడు. ఇంతకీ ఆ రూల్ ఏంటీ అంటే..

ధోనీని అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణించాలని సీఎస్కే ప్రతిపాదన చేస్తోంది. ధోనీ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి అయిదేళ్లు పూర్తికావడంతో అనామక ప్లేయర్గా పరిగణించాలని డిమాండ్ చేస్తుంది. రిటైర్డ్ అయిన ఆటగాళ్ల విషయంలో ఐపీఎల్ ఆరంభం నుంచి 2021 వరకు ఈ నిబంధనను అమలు చేశారని, దాన్ని తిరిగి ఈ మెగా వేలంలో కొనసాగించాలని కోరుతోంది.
ఐపీఎల్ 2022 మెగా వేలం రూల్స్ ప్రకారం అనామక ప్లేయర్ రిటెన్షన్ ప్రైజ్ రూ.4 కోట్లుగా ఉంది. గత మూడు సీజన్లకు ధోనీ రూ.12 కోట్లు తీసుకున్నాడు. దీంతో సీఎస్కే డిమాండ్ చేసే రూల్ను ఐపీఎల్ నిర్వాహకులు అంగీకరిస్తే ధోనీ అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణించాల్సి ఉంటుంది. అప్పుడు ధోనీ దాదాపు రూ.8 కోట్ల మేర నష్టపోతాడు.
మరోవైపు ధోనీ ఐపీఎల్-2025కు అయినా అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై స్పష్టత లేదు. దీంతో ధోనీ కోసం భారీ మొత్తం వెచ్చించకుండా అన్క్యాప్డ్ ప్లేయర్గా తక్కువ ధరతో ఫ్రాంచైజీలో కొనసాగించాలని సీఎస్కే భావిస్తుంది. అలా చేస్తే తన పర్స్ వ్యాల్యూలో మిగిలిన మొత్తం ఇతర స్టార్ ప్లేయర్లపై ఫోకస్ చేయవచ్చని భావిస్తుంది. సీఎస్కే నిషేధానికి గురైన సమయంలో మినహా మిగిలిన టైమ్లో ధోనీ సీఎస్కేతోనే కొనసాగిన విషయం తెలిసిందే.