టీమిండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ను రీసెంట్గా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఎంపిక చేయలేదన్న సంగతి తెలిసిందే. అందుకు గల కారణాన్ని కూడా కెప్టెన్ రోహిత్ శర్మ తెలిపాడు. పాత బంతితో సిరాజ్ ఎక్కువ ప్రభావం చూపలేకపోతున్నాడని రోహిత్ అన్నాడు. తాజాగా ఐపీఎల్ 2025 ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ విషయంపై సిరాజ్ కాస్త ఘాటుగానే స్పందించాడు.
అదే నా లక్ష్యం..
"నేను గతంలో పాత బంతితో అత్యధిక వికెట్లు తీశాను. ప్రపంచంలోని టాప్ 10 ఫాస్టెస్ట్ బౌలర్స్లో ఒకడిని. నా ఎకానమి రేట్ కూడా లోగా ఉంది. నా గణాంకాలే నా ప్రదర్శన ఎలా ఉందో చెబుతాయి. నేను కొత్త బంతితో, పాత బంతితో.. రెండితోనూ బాగా రాణించాను. ప్రస్తుతం నాకు దొరికిన సమయంలో ఫిట్నెస్తో పాటు బౌలింగ్పై పూర్తి దృష్టి సారించాను. కొత్త బాల్ తో పాటు పాత బంతితోనూ ప్రాక్టీసింగ్ చేస్తున్నాను. అలానే నెమ్మది బంతులు, యార్కర్స్పై కూడా దృష్టి సారించాను. ఐపీఎల్ లో బాగా రాణించి, గుజరాత్ టైటాన్స్ కోసం టైటిల్ అందించడమే నా లక్ష్యం." అని సిరాజ్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం సిరాజ్ అన్న మాటలు చర్చనీయాంశంగా మారాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో తనను ఎంపిక చేయకపోవడంపై వచ్చిన ఫ్రస్టేషన్ను.. అతడు ఐపీఎల్లో ఏ విధంగా చూపించి రాణిస్తాడో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఈ ఐపీఎల్ 2005 సీజన్ కోసం జరిగిన మెగా వేలంలో సిరాజ్ను ఆర్సీబీ విడిచిపెట్టింది. దీంతో గుజరాత్ టైటాన్స్ సిరాజ్ ను 12.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ జట్టులో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన రెండో ఆటగాడు సిరాజే కావడం విశేషం.
