టీమిండియా స్టార్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటతోనే కాకుండా తన స్టైలిష్ లుకింగ్ ప్రెజన్స్తోనూ ఫ్యాన్స్ను ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తన బియర్డ్ స్టైల్తో అభిమానులను ఫిదా చేస్తుంటాడు. అయితే తాజాగా అతడు గుజరాత్ టైటాన్స్ కాంప్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను జీటీ ఫ్రాంఛైజీ సోషల్ మీడియా వేదికగా పంచుకోగా అది అభిమానులను ఆకట్టుకుంటోంది.
క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోన్న ఐపీఎల్ 2025 మరో 9 రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ లో చాలా మంది ప్లేయర్లు ఒక జట్టు నుంచి మరో జట్టుకు మారిపోయిన సంగతి తెలిసిందే. అందులో మహమ్మద్ సిరాజ్ కూడా ఒకడు. గత కొన్నేళ్లుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. ఈ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తరఫున ఆడనున్నాడు. మెగా వేలంలో ఆర్సీబీ సిరాజ్ ను వదిలేయగా.. గుజరాత్ టైటాన్స్ భారీ ధరకు దక్కించుకుంది. రూ.12.25 కోట్లకు కొనుగోలు చేసింది.

రయ్ రయ్ మంటూ..
అయితే మార్చి 22 నుంచి ఐపీఎల్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇప్పటికే అన్ని జట్లు ట్రైనింగ్ క్యాంపులో ప్రాక్టీస్ మొదలు పెట్టేశాయి. గుజరాత్ టైటాన్స్ కూడా తమ ట్రైనింగ్ క్యాంపులో సాధన మొదలుపెట్టింది. అయితే తాజాగా మహమ్మద్ సిరాజ్ డిఫరెంట్ గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. యాక్టివా స్కూటీని రైడ్ చేసుకుంటూ వచ్చి జట్టుతో కలిశాడు.దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది గుజరాత్ టైటాన్స్. ట్రైనింగ్ క్యాంపులోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ అంటూ ట్యాగ్ లైన్ రాసుకొచ్చింది. ప్రాక్టీస్ సెషన్లో పాల్గొనడానికి వచ్చిన సిరాజ్ను టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని ఆహ్వానించాడు. ఆ తర్వాత ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్న సిరాజ్ కాసేపు వర్కౌట్స్ చేసి బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు.
గుజరాత్ టైటాన్స్ 2025 స్క్వాడ్
రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు: రషీద్ ఖాన్(రూ.18కోట్లు), శుభ్మన్ గిల్(రూ.16.50కోట్లు), సాయి సుదర్శన్(రూ.8.50కోట్లు), తెవాటియా (రూ.4కోట్లు), షారుక్ ఖాన్(రూ.4కోట్లు)
వేలంలో కొనుగోలు చేసిన ప్లేయర్స్ :
జోస్ బట్లర్(రూ. 15.75కోట్లు), మహమ్మద్ సిరాజ్(రూ.12.25కోట్లు), కగిసో రబాడ(రూ.10.75కోట్లు), ప్రసిద్ధ్ కృష్ణ(రూ.9.50కోట్లు), వాషింగ్టన్ సుందర్(రూ. 3.20కోట్లు), రూథర్ఫోర్డ్(రూ.2.60కోట్లు), గెరాల్డ్ కొయిట్జీ(2.40కోట్లు), గ్లెన్ ఫిలిప్స్(రూ.2కోట్లు), సాయి కిశోర్ (రూ.2కోట్లు), మహిపాల్ లామ్రోర్(రూ.1.70కోట్లు), గుర్నూర్ సింగ్ బ్రార్(రూ. 1.30కోట్లు), మహ్మద్ అర్షద్ ఖాన్(రూ.1.30కోట్లు), కరీం జనత్(రూ.75లక్షలు), జయంత్ యాదవ్(రూ.75లక్షలు), ఇషాంత్ శర్మ(రూ.75లక్షలు), కుమార్ కుషాగ్ర(రూ.65లక్షలు), కుల్వంత్ ఖేజ్రోల్య(రూ.30లక్షలు), మానవ్ సుతార్(రూ.30లక్షలు), అనుజ్ రావత్(రూ.30లక్షలు), నిషాంత్ సింధు(రూ.30లక్షలు)