క్రికెట్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ నిబంధనలు ఖరారు అయ్యాయి. గత మెగా వేలానికి భిన్నంగా బీసీసీఐ ఈసారి నిబంధనలను రూపొందించింది. రైటు మ్యాచ్ కార్డ్ రూల్ను తిరిగి తీసుకువచ్చారు. అలాగే రిటైర్మెంట్ ప్రకటించి అయిదేళ్లు గడిచిన ఆటగాడిని అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణించనున్నారు. గరిష్టంగా ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. వేలం లేదా రిటెన్షన్ ద్వారా ఫ్రాంచైజీలతో ఒప్పందం చేసుకున్న ఆటగాళ్లు ఐపీఎల్ 2027 వరకు కొనసాగాలి.
ఫ్రాంచైజీ పర్స్ వ్యాల్యూను రూ.120 కోట్లకు పెంచారు. బెంగళూరు వేదికగా శనివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్లో ఈ నిబంధనలను ఖరారు చేశారు. అయితే రిటైన్ చేసుకునే ఆరుగురు ఆటగాళ్లలో ఒకరు కచ్చితంగా అన్క్యాపడ్ ప్లేయర్ ఉండాలనే కండిషన్ పెట్టారు. గరిష్టంగా ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఉంది. మిగిలిన అయిదుగురు ఆటగాళ్లు ఇండియన్స్ లేదా విదేశీ ప్లేయర్లు అయినా కావొచ్చు.

రిటైన్ లిస్ట్లో విదేశీ ఆటగాళ్లకు ఎలాంటి పరిమితి విధించలేదు. అంతేగాక ఆరుగురు ప్లేయర్లను నేరుగా రిటైన్ చేసుకోవచ్చు. లేదా అందర్నీ ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా అయినా పొందవచ్చు. లేదా రెండింటి కలయికతో అయినా ఫ్రాంచైజీతోనే అట్టిపెట్టుకోవచ్చు. రిటెన్షన్ స్లాబ్లను ఖరారు చేశారు. అయిదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంటే రూ.75 కోట్లు చెల్లించాలి. అన్క్యాప్డ్ ప్లేయర్కు రూ. 4 కోట్లుగా నిర్ణయించారు.
తొలి మూడు రిటెన్షన్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ.11 కోట్లు చెల్లించాలి. మిగిలిన రెండు రిటెన్షన్లకు రూ.18 కోట్లు, రూ.14 కోట్లు వెచ్చించాలి. అంటే పర్స్ వ్యాల్యూ రూ.120 కోట్లలో రిటెన్షన్కు రూ.75 కోట్లు పోగా మిగిలిన రూ.45 కోట్లతో మెగా వేలానికి వెళ్లాల్సి ఉంటుంది. అన్క్యాప్డ్ ప్లేయర్ను కూడా రిటైన్ చేసుకుంటే రూ.41 కోట్లతోనే ఆక్షన్లో బరిలోకి దిగాలి.
రిటైర్మెంట్ గడిచి అయిదేళ్లు పూర్తయిన ఆటగాడిని అన్క్యాప్డ్ ప్లేయర్గా పరిగణించాలనే నిబంధనను తిరిగి తీసుకువచ్చారు. దీంతో ఎంఎస్ ధోనీని రూ.4 కోట్లకే చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ చేసుకోవచ్చు. ఇక మెగా వేలానికి సంబంధేతర విషయాలు కూడా గవర్నింగ్ కౌన్సిల్లో చర్చించారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను 2027 సీజన్ వరకు కొనసాగనుంది.