క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ మెగా వేలంలో కొన్ని నిబంధనలు దాదాపు ఖరారయ్యాయి. జులై 31న ఫ్రాంచైజీలతో ఐపీఎల్ నిర్వాహకులు సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ అనంతరం అధికారికంగా కొత్త రూల్స్ను ప్రకటిస్తారు. అయితే మునపటిలా కాకుండా ఈ సారి మెగా ఆక్షన్ భిన్నంగా సాగుతుందని సమాచారం.
ప్రముఖ జాతీయ మీడియా ప్రకారం.. కొన్ని ఫ్రాంచైజీలు ఊహించని విధంగా డిమాండ్లు చేశాయి. కనీసం ఆరుగురు ప్లేయర్లకు రైట్ టూ మ్యాచ్ కార్డ్ ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించాలని కోరింది. దాంతో పాటు నలుగురు నుంచి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్డ్ చేసుకునేలా అవకాశం ఇవ్వాలని పేర్కొంది. అయితే దీనిపై బీసీసీఐ సానుకూలంగా స్పందించలేదు. అలా చేస్తే వేలం చప్పగా సాగుతుందని భావిస్తుంది.

కానీ ఫ్రాంచైజీలకు అనుకూలించే కొత్త నిబంధనలు చేర్చనున్నారు. రూ.90 కోట్ల శాలరీ క్యాప్ను రూ.130 నుంచి రూ. 140 కోట్లకు పెంచనున్నారు. అంటే ఫ్రాంచైజీల పర్సు వ్యాల్యూ భారీగా పెరగనుంది. మెగా వేలాన్ని ప్రతి అయిదేళ్లకు ఒకసారి నిర్వహించాలని కొన్ని ఫ్రాంచైజీలు కోరుతున్నాయి. దీని గురించి సమావేశంలో చర్చించి సానుకూలంగా నిర్వాహకులు స్పందించే అవకాశం ఉంది. అయితే మూడు నుంచి నాలుగేళ్లకు మాత్రమే పెంచే ఛాన్స్ ఉంది.
ఇక అయిదుగురు ప్లేయర్లను ఫ్రాంచైజీలు రిటైన్డ్ చేసుకునే అవకాశం ఇవ్వాలని బీసీసీఐ భావిస్తుంది. కానీ రైట్ టూ మ్యాచ్ కార్డ్ (ఆర్టీఎమ్) గురించి ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీని వల్ల కొన్ని సానుకూలతలు, ప్రతికూలతలు ఉండటంతో ఆలోచిస్తోంది. ఆర్టీఎమ్లో పాజిటివ్ ఏంటంటే.. మార్కెట్ విలువకు తగ్గట్లుగా ప్లేయర్కు ధర పలుకుతుంది.
ఇక నెగిటివ్ విషయానికొస్తే..కీలకమైన ఆటగాళ్లను తమ జట్టుతో నిలుపుకోవాలని ఓ ఫ్రాంచైజీ భావించిన పరిస్థితుల్లో.. ఇతర ఫ్రాంచైజీలు ఉద్దేశపూర్వకంగా ఆ సదరు ప్లేయర్ల ధరను అమాంతం పెంచే అవకాశం ఉంది. 2021 మెగా వేలంలో ఆర్టీఎమ్లు లేవు. కాగా, ఈ నెలాఖరున మీటింగ్ గురించి ఫ్రాంచైజీలకు ఐపీఎల్ సీఈవో హేమింగ్ అమిన్ గురువారం ఉదయం మెసేజ్లను పంపారు.