ఐపీఎల్ మెగా వేలం ముగిసింది. జెడ్డా వేదికగా ఆది, సోమవారాల్లో జరిగిన ఈ మెగా ఆక్షన్ అంచనాలకు మించి సాగింది. రిషభ్ పంత్ (రూ.27 కోట్లు- లక్నో సూపర్ జెయింట్స్), శ్రేయస్ అయ్యర్ (రూ. 26.75 కోట్లు- పంజాబ్ కింగ్స్), వెంకటేశ్ అయ్యర్ (రూ.23.75 కోట్లు- కేకేఆర్) భారీ ధర దక్కించుకున్నారు. బిహార్కు చెందిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం రాజస్థాన్ రాయల్స్ రూ.1.10 కోట్లు వెచ్చించింది.
యువ ఆల్రౌండర్ అన్షుల్ కాంబోజ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ రూ.3.40 కోట్లు ఖర్చు పెట్టింది. హిట్టర్ ప్రియాన్ష్ ఆర్య కోసం పంజాబ్ కింగ్స్ ఏకంగా రూ.3.80 కోట్ల భారీ ధర వెచ్చించింది. మొత్తంగా 182 మంది ఆటగాళ్లను కొనుగోలు చేసిన 10 ఫ్రాంఛైజీలు ఇందుకు రూ.639.15 కోట్లు ఖర్చుపెట్టాయి. ఇందులో 62 మంది విదేశీ ఆటగాళ్లున్నారు. కాగా, ఈ మెగా వేలంలో మన తెలుగు కుర్రాళ్లు కూడా మెరిశారు.

గుంటూరుకు చెందిన 20 ఏళ్ల షేక్ రషీద్ మరోసారి చెన్నై సూపర్ కింగ్స్కు వెళ్లాడు. గత సీజన్లోనూ రషీద్ సీఎస్కేకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. గత వేలంలో గుంటూరు కుర్రాడిని రూ.20 లక్షల కనీస ధరకు చెన్నై సొంతం చేసుకుంది. అయితే తుది జట్టులో ఆడే అవకాశం రాకపోయినా, సబ్స్టిట్యూట్ ఫీల్డర్గా స్టన్నింగ్ క్యాచ్ అందుకుని అందరి దృష్టి ఆకర్షించాడు. ఈ మెగా వేలంలో షేక్ రషీద్ను సీఎస్కే కనీస ధర రూ.30 లక్షలు వెచ్చించి సొంతం చేసుకుంది.
విశాఖపట్నంకు చెందిన 24 ఏళ్ల పైల అవినాష్ను రూ. 30 లక్షల కనీస ధరతో పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ కుడిచేతి వాటం బ్యాటర్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్లో సెంచరీతో అలరించాడు. కాకినాడ ఫాస్ట్ బౌలర్ సత్యనారాయణ రాజును ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలు వెచ్చించి దక్కించుకుంది. ముంబై జట్టులో ఉన్న తెలుగు తేజం తిలక్ వర్మతో కలిసి సత్యనారాయణ బరిలోకి దిగే అవకాశం ఉంది. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మను ముంబై రూ.8 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
అలాగే శ్రీకాకుళం కుర్రాడు త్రిపురణ విజయ్ను ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఈ స్పిన్నర్ కోసం ఢిల్లీ రూ.30 లక్షలు ఖర్చుపెట్టింది. అయితే ఆంధ్ర ప్లేయర్లు కేఎస్ భరత్, బైలపూడి యశ్వంత్లకు నిరాశే మిగిలింది. అలాగే సిరిసిల్ల కుర్రాడు ఆరవెల్లి అవనీశ్ను కూడా ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. టీమిండియా స్టార్ క్రికెటర్, హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్తో సహా మనోళ్లు అయిదుగురు మెగావేలంలో అమ్ముడుపోయారు. సిరాజ్ కోసం గుజరాత్ టైటాన్స్ రూ.12.25 కోట్లు ఖర్చుపెట్టింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డిని సన్రైజర్స్ హైదరాబాద్ రూ.6 కోట్లు వెచ్చించి రిటైన్ చేసుకున్న విషయం తెలిసిందే.