రిటైన్ లిస్ట్ను సమర్పించడానికి ఫ్రాంచైజీలకు గడువు మరో వారం మాత్రమే. అక్టోబర్ 31వ తేదీలోపు రిటైన్ లిస్ట్ను సమర్పించాల్సి ఉంది. ఓ ఫ్రాంచైజీ ఆరుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకునే వెసులుబాటును బీసీసీఐ కల్పించింది. అందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఛాన్స్ ఇచ్చింది.నిబంధనలకు అనుగుణంగా నేరుగా నిర్ణయించిన ధరతో రిటైన్ చేసుకోవచ్చు లేదా ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా ఫ్రాంచైజీ దక్కించుకోవచ్చు.
రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ.18 కోట్లు, రూ.14 కోట్లు, రూ.11 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. నాలుగు, అయిదో ఆటగాడిని తీసుకోవాలనుకుంటే తిరిగి రూ.18 కోట్లు, రూ.14 కోట్లు చెల్లించాలి. అన్క్యాప్డ్ ప్లేయర్ను రిటైన్ చేసుకుంటే మాత్రం రూ.4 కోట్లుగా నిర్ణయించింది. రిటెన్షన్ నిర్ణీత ధర కంటే ఎక్కువ మొత్తాన్ని ఇచ్చే ఆలోచన ఫ్రాంచైజీలకు బీసీసీఐ వదిలేసింది. ఈ నేపథ్యంలో ఫ్రాంచైజీలు తమ రిటైన్ లిస్ట్ను దాదాపుగా ఖరారు చేశాయి.

అయితే లక్నో సూపర్ జెయింట్స్ తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ లేకుండానే రిటైన్ లిస్ట్ను సిద్ధం చేసిందని సమాచారం. మరోవైపు యువ స్పీడ్ సంచలనం మయాంక్ యాదవ్, వెస్టిండీస్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ను అట్టిపెట్టుకోవాలని లక్నో ఫ్రాంచైజీ నిర్ణయించుకుందని తెలుస్తోంది. వీరిద్దరితో పాటు స్పిన్నర్ రవి బిష్ణోయ్, యువ బ్యాటర్ ఆయుష్ బదోనిని కూడా రిటైన్ లేదా ఆర్టీఎమ్ ద్వారా దక్కించుకోవాలని భావిస్తోంది.

కాగా, మయాంక్ యాదవ్ను లక్నో సూపర్ జెయింట్స్ తమ రిటైన్ లిస్ట్లో రెండో ఎంపికగా పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతనికి లక్నో ఫ్రాంచైజీ రూ. 14 కోట్లు చెల్లించనుంది. ఈ ఐపీఎల్ సీజన్లో అరంగేట్రం చేసిన మయాంక్ కేవలం 4 మ్యాచ్లే ఆడాడు. 7 వికెట్లు పడగొట్టాడు. అయితే 150+ కి.మీ/వేగంతో నిలకడగా బంతులు వేసే సామర్థ్యం ఉండటంతో మయాంక్కు భారీ డిమాండ్ ఏర్పడింది. దీంతో అతన్ని వేలంలోకి బదులుగా నేరుగా రిటైన్ చేసుకోవాలని ఫ్రాంచైజీ నిర్ణయించకుంది. మయాంక్ 17 లిస్ట్-ఏ మ్యాచ్ల్లో 34 వికెట్లు, ఆడిన ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్లో రెండు వికెట్లు తీశాడు.