IPL 2025 Match Fixing: ఐపీఎల్.. ఈ లీగ్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ లీగ్ వచ్చిందంటే బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతుంది. ఫిక్సింగ్ ఆరోపణలు కూడా వినిపిస్తుంటాయి. అయితే తాజాగా ఐపీఎల్ 2025లో విస్తుపోయే విషయం ఒకటి బయటకు వచ్చింది. ఈ సీజన్ లో ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిసింది. ఇప్పటికే ఈ విషయమై బీసీసీఐ.. మెగా లీగ్ లో పాల్గొన్న 10 జట్లకు ముందస్తు హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది. ఎవరైనా తమను సంప్రదించడానికి ప్రయత్నిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని బీసీసీఐ.. ఆయా జట్లకు సూచించింది.
హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారవేత్తే..
బీసీసీఐకి అందిన సమాచారం ప్రకారం.. హైదరాబాద్కు చెందిన ఓ వ్యాపారవేత్త మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే అతడు అన్ని ఐపీఎల్ జట్లతో దగ్గరవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్నాడని సమాచారం అందింది. ఈ సీజన్ లో ఉన్న జట్ల ఆటగాళ్లు, ఓనర్లు, కోచింగ్ స్టాఫ్, కామెంటేటర్లకు దగ్గరవ్వడానికి తెగ ట్రై చేస్తున్నాడట.
గిఫ్ట్లు, పార్టీలు
ఇప్పటికే సదరు వ్యాపారవేత్త.. కొంతమంది ఆటగాళ్లకు, కోచులను కలిసి ఖరీదైన జ్యువెలరీ, గిఫ్ట్ లు ఇచ్చినట్లు కూడా రిపోర్టులు చెబుతున్నాయి. ఫ్యాన్ అని చెప్పుకుంటూ ఆటగాళ్లు బస చేస్తోన్న హోటల్స్ కు వెళ్లి.. ఇప్పటికే వారిని కలిశాడని, వారిని పార్టీలకు కూడా ఆహ్వానించాడని తెలిసింది. ఆటగాళ్ల కుటంబాలను కూడా కలిసి ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడని సమాచారం అందింది.

సోషల్ మీడియా ద్వారా కూడా..
ఈ హైదరాబాద్ వ్యాపారవేత్త క్రికెటర్లు, కోచ్లకు ఉన్న బంధువులను సోషల్ మీడియా ద్వారా కూడా సంప్రదించే ప్రయత్నాలు చేస్తున్నాడని రిపోర్ట్స్ లో వచ్చాయి. కాబట్టి సోషల్ మీడియాలో కూడా ఎవరైన వ్యక్తి సంప్రదిస్తే.. జాగ్రత్తగా ఉండాలని, వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని బీసీసీఐ అడ్వైస్ ఇచ్చింది. ఇలాంటి ఆన్ లైన్ కాంటాక్ట్స్ ఫిక్సింగ్కు దారితీసే అవకాశం ఉందని ACSU కూడా ఆందోళన వ్యక్తం చేసింది.
గతంలో అరెస్ట్ కూడా..
ఐపీఎల్లో ఫిక్సింగ్ ఆరోపణలు గతంలో కూడా కలకలం రేపాయి. ముఖ్యంగా 2013లో రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్స్ శ్రీశాంత్, అజిత్ చందిలా, అంకిత్ చవాన్ స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో అరెస్ట్ కూడా అయ్యారు. ఈ సంచలన ఘటన తర్వాత బీసీసీఐ యాంటీ- కరప్షన్ యూనిట్ను మరింత బలోపేతం చేసింది. ఆటగాళ్లకు కఠిన నిబంధనలను కూడా విధించింది.