ఐపీఎల్ టీమ్ లఖ్ నవూ సూపర్ జెయింట్స్ క్రికెట్ అభిమానులను అలరించేందుకు మరో లీగ్ లోకి అడుగుపెట్టింది. ది హండ్రెడ్ లీగ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఈ లీగ్ కు చెందిన మాంచెస్టర్ ఒరిజినల్స్ టీమ్ వేలానికి రాగా.. LSG యాజమాన్యం ఆ జట్టును కళ్లు చెదిరే ధర పెట్టి దక్కించుకుంది. టీమ్ మొత్తం విలువలోని 49 శాతం వాటాను ఊహించని విధంగా భారీ ధరతో బిడ్డింగ్ వేసి గెలుపొందింది. అంతకుముందు హండ్రెడ్ లీగ్ లోని లండన్ స్పిరిట్ జట్టు కోసం బిడ్ వేసి విఫలమైన LSG యాజమాన్యం.. ఇప్పుడు మాంచెస్టర్ ఒరిజినల్స్ ను బిడ్డింగ్ వేసి సొంతం చేసుకుంది.
మరింత క్రికెట్ మజాను అందించేందుకు..
దాదాపు 116 మిలియన్ పౌండ్ల భారీ ధరకు మాంంచెస్టర్ ఒరిజినల్స్ జట్టును లఖ్ నవూ సూపర్ జెయింట్స్ యాజమాన్యం అయిన సంజీవ్ గోయెంకా RPSG గ్రూప్ కొనుగోలు చేసింది. అంటే భారతీయ కరెన్సీలో దాదాపు రూ.1251 కోట్లు. తమతో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ జత కట్టడంపై మాంచెస్టర్ కు చెందిన లంకషైర్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. భవిష్యత్ లో కలిసి పని చేయడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపింది. అలానే ప్రేక్షకులకు మరింత ఉత్సాహకరమైన, ప్రత్యేకమైన క్రికెట్ మజాను అందిస్తామని పేర్కొంది.

రెండో జట్టుగా..
రీసెంట్ గా ది హండ్రెడ్ లీగ్ లోకి ఐపీఎల్ స్టార్ టీమ్ ముంబయి ఇండియన్స్ కూడా అడుగుపెట్టింది. ఈ లీగ్ కు చెందిన ఓవల్ ఇన్విన్సిబుల్స్ జట్టును భారీ ధరకు ముంబయి యాజమాన్యం కొనుగోలు చేసింది. దీంతో ది హండ్రెడ్ లోగ్ లోకి అడుగుపెట్టిన రెండో ఐపీఎల్ టీమ్ గా LSG నిలిచింది. గతంలో 2016-17 సమయంలో ఐపీఎల్ లో రైజింగ్ పుణె జెయింట్స్ ను కొనుగోలు చేసిన సంజీవ్ గోయెంకాకు చెందిన RPSG గ్రూప్.. 2021లో లఖ్ నవూ సూపర్ జెయింట్స్ జట్టును రూ.7090కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అలానే SA20 లీగ్ లో డర్బన్ ఫ్రాంఛైజీని మెయిన్ టెయిన్ చేస్తోంది.
ఆ రెండు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కూడా
సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం అయిన సన్ గ్రూప్ కూడా.. హండ్రెడ్ లీగ్ లోని Northern సూపర్ ఛార్జర్స్, ట్రెంట్ రాకెట్స్ ను కొనుగోలు చేయాలని ఆసక్తిగా చూపిస్తోందట. దిల్లీ క్యాపిటల్స్ కో ఓనర్స్ అయిన జీఎమ్ఆర్ గ్రూప్.. Southern బ్రేవ్ లో వాటాను సొంతం చేసుకోవాలని ఆశిస్తోందట.