IPL 2025: రాజస్థాన్ రాయల్స్ను ఓడించిన తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు పాయింట్ల పట్టికలో ఇప్పుడు టాప్-4కి చేరుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా కూడా చాలా సంతోషంగా కనిపించాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో సంజీవ్ గోయెంకా తరచుగా స్టేడియంలో కూర్చుని ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ కనిపిస్తాడు. అయితే సంజీవ్ గోయెంకా ఓడిపోయిన ఆటగాళ్లను తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. శనివారం వైభవ్ సూర్యవంశీ 14 సంవత్సరాల వయస్సులో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. తన తొలి మ్యాచ్లో వైభవ్ బ్యాటింగ్ చేయడం చూసి లక్నో సూపర్ జెయింట్స్ యజమానికి కూడా థ్రిల్ అయ్యాడు. సంజీవ్ గోయెంకా సోషల్ మీడియాలో ఒక ప్రత్యేక పోస్ట్ను కూడా పంచుకున్నాడు.
వైభవ్ గురించి సంజీవ్ గోయెంకా ప్రత్యేక సందేశం
లక్నో సూపర్ జెయింట్స్ విజయం తర్వాత సంజీవ్ గోయెంకా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ను పంచుకున్నారు. అందులో సంజీవ్ గోయెంకా మొదట మొత్తం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్, అబ్దుల్ సమద్, అవేష్ ఖాన్, ఐడెన్ మార్క్రమ్లను అభినందించాడు. దీని తర్వాత వైభవ్ సూర్యవంశీకి శుభాకాంక్షలు తెలుపుతూ.. "ప్రతిభావంతుడైన వైభవ్ సూర్యవంశీ గొప్ప అరంగేట్రం చేశాడు. భవిష్యత్ సూపర్ స్టార్. వైభవ్ విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అని సంజీవ్ గోయెంకా రాసుకొచ్చారు. ఇదిలా ఉండగా.. మ్యాచ్ తర్వాత సంజీవ్ గోయెంకా స్వయంగా వైభవ్ను ప్రశంసించడం కనిపించింది. వారి చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

తొలి మ్యాచ్లోనే చరిత్ర సృష్టించిన వైభవ్
వైభవ్ సూర్యవంశీ తొలి మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. ఒకానొక దశలో మొదటి మ్యాచ్లోనే వైభవ్ సూర్యవంశీ అర్థసెంచరీ చేస్తాడని అనిపించింది. కానీ అది జరగలేదు. ఔట్ అయిన తర్వాత మైదానం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వైభవ్ సూర్యవంశీ భావోద్వేగానికి లోనయ్యాడు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు.
ఈ మ్యాచ్లో బ్యాటింగ్ చేసిన వైభవ్ సూర్యవంశీ 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు. ఇందులో 3 సిక్సర్లు , 2 ఫోర్లు ఉన్నాయి. ఐపీఎల్లో తన తొలి బంతికే వైభవ్ శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో తొలి బంతికే భారీ సిక్స్ కొట్టాడు. అయితే ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.