LSG VS MI: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. దీంతో ముంబయి ఇండియన్స్ లక్ష్యం 204గా నమోదైంది.
ఆ ఇద్దరు ధనాధన్..
టాస్ గెలిచిన లక్నోకు బ్యాటింగ్ లో ఓపెనర్లు మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 60 పరుగులు), మార్క్రమ్ (38 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 53 పరుగులు) మంచి శుభారంభం ఇచ్చారు. భీకర ఫామ్లో ఉన్న మార్ష్ అయితే తొలి ఓవర్ నుంచే బంతిని దంచుతూ.. ముంబైపై చెలరేగాడు. బౌల్ట్ , దీపక్ చాహర్ బౌలింగ్లో భారీ షాట్లతో బౌండరీలు బాదాడు. అనంతరం యువపేసర్ అశ్వినీ కుమార్ బౌలింగ్ లో ఆధిపత్యం ప్రదర్శించాడు. కానీ ఆ తర్వాత విఘ్నేశ్ పుత్తూర్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ఆ తర్వాత ఆయూష్ బదోనీ (19 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 30 పరుగులు) కీలక ఇన్నింగ్స్ తో రాణించాడు. ఆఖర్లో డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 27 పరుగులు) ధనాధన్ ఆడాడు. మిగతా వారు విఫలమయ్యారు.
హార్దిక్ పాంచ్ పటాఖా...
ముంబయి బౌలర్లలో హార్దిక్ పాండ్య అదిరే ప్రదర్శన చేశాడు. 5 వికెట్ల ప్రదర్శన చేసి అదరగొట్టాడు. ప్రత్యర్థి జట్టు బౌలర్లు చెలరేగి ఆడుతున్నా.. వారికే చెమటలు పట్టించాడు. ఇతర ముంబయి బౌలర్లలో ట్రెన్ బౌల్ట్, అశ్వనీ కుమార్, విఘ్నేశ్ పుత్తూర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
