Rishabh Pant: ఐపీఎల్ 2025లో రూ.27 కోట్ల ప్రైస్ ట్యాగ్ తో అత్యంత కాస్ట్లీ ప్లేయర్ గా బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ రిషభ్ పంత్ నిరాశపరుస్తూనే ఉన్నాడు. ఏ మాత్రం తన ధరకు న్యాయం చేయట్లేదు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 110 పరుగులు మాత్రమే చేశాడంటే.. ఎంత చెత్తగా ఆడాడో అర్థమవుతోంది. ఇందులో ఒకే ఒక్క అర్ధ శతకం (63) ఉంది. మిగిలిన 9 మ్యాచుల్లో కలిపి కేవలం 47 పరుగులే చేయగలిగాడు. దీంతో అతడి ఫామ్ పై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి.
తాజాగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచులోనూ అతడు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు. ఆఫ్ స్పిన్నర్ విల్ జాక్స్ అతడిని వెనక్కి పంపాడు. దీంతో మళ్లీ క్రికెట్ అభిమానులు.. రూ.27 కోట్లు బొక్క అంటూ మరోసారి పంత్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పంత్ ప్రైస్ ట్యాగ్తో పాటు అతడి ఫామ్పై కీలక వ్యాఖ్యలు చేశాడు లక్నో మెంటార్ జహీర్ ఖాన్.

ఆ రెండింటికి ముడి పెట్టను..
భారీ ప్రైస్ ట్యాగ్ వల్లే పంత్ ఇబ్బందిపడుతున్నాడనే వస్తోన్న వ్యాఖ్యలను అతడు ఖండించాడు. "పంత్ ప్రైస్ ట్యాగ్ (రూ.27 కోట్లు), అతడి ఆటకు నేను లింక్ పెట్టను. అతడు నాయకడు. ఓ నాయకుడిగా అతడు అద్భుతమైన వ్యక్తి. ఇది మాత్రమే నేను చెప్పగలను. అతడు జట్టులో ప్రతి ఒక్కరినీ బాగా కలుపుకుని, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ, ఐపీఎల్లో ప్రణాళికలను బాగా అమలు చేస్తున్నాడు. నాయకత్వం పరంగా అతడు అన్ని విషయాల్లో సరిగ్గా ఉంటూ జట్టును ముందుకు నడిపిస్తున్నాడు. మిడిలార్డర్లో అతడు కచ్చితంగా ప్రభావం చూపిస్తాడని భావిస్తున్నాను. త్వరలోనే మనం ఆశించిన ప్రదర్శన పంత్ చేస్తాడన్న నమ్మకం నాకు ఉంది."
క్లిక్ అయితే చాలు..
"ఒక్కసారి క్లిక్ అయితే చాలు చాలు అతడు రాణిస్తాడు. ప్రైస్ ట్యాగ్తో అతడు ఒత్తిడికి గురౌతున్నాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే పంత్ ఆశావాద క్రికెటర్. సానుకూల దృక్ఫథంతో ఉండే వ్యక్తి. అతడిది అలాంటి వ్యక్తిత్వం కాదు. గత మ్యాచులో ఏం జరిగిందనేది ముగిసిన పేజీ. తర్వాత ఏమి జరుగుతుందనేది ముఖ్యం. మా నుంచి ఎప్పుడూ అతడికి మద్దతు ఉంటుంది."
ఆ నమ్మకం ఉంది..
"ఓ ఆటగాడు ఫామ్ కోల్పోవచ్చు, మరొక ఆటగాడు మంచి ఫామ్లో ఉండవచ్చు. దీంతో ఒకానొక దశలో ఒత్తిడి పెరుగుతుంది. కానీ అతడి తిరిగి పుంజుకోవడానికి ఒక మంచి ఇన్నింగ్స్ చాలు. పంత్పైన మాకు పూర్తి నమ్మకం ఉంది. అతతడు జట్టును సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లగలడు. అందులో ఎటువంటి అనుమానం లేదు." అని జహీర్ ఖాన్ వెల్లడించాడు.
నెట్రన్రేట్ పై ఫోకస్..
కాగా, లక్నో ఇప్పటివరకు 10 మ్యాచులు ఆడింది. అందులో ఐదు గెలిచింది. ఇంకా నాలుగు మ్యాచులు మిగిలి ఉన్నాయి. ఇందులో కనీసం మూడింటిలో గెలిస్తే ప్లేఆఫ్స్కు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే నెట్రన్రేట్ ఇప్పుడు ఎంతో కీలకం. ఇప్పుడా జట్టు రన్ రేట్ నెగటివ్ గా ఉంది. తన నెక్ట్స్ మ్యాచును పంజాబ్ కింగ్స్ తో ఆడనుంది.